వైఎస్ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ.. దర్యాప్తును త్వరగా పూర్తిచేయాలని సుప్రీం ఆదేశం..
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా తెలిపింది.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా తెలిపింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరుపై ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు పురోగతిని నేరుగా పర్యవేక్షించాలని ఆమె తన పిటిషన్లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఏపీలో కేసు విచారణ జరిగితే న్యాయం జరగదని సునీతా రెడ్డి పేర్కొన్నారు. హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. వివేకా హత్య కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించిన తీర్పును వెలువరించింది.
కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్టుగా జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని సంబంధిత పత్రాలు, ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేయబడతాయి. భారీ కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసంపై తదుపరి దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పాక్షికంగా చేయాలని స్పష్టం చేసింది.
మరణించిన వ్యక్తి కూతురు, భార్యకు విచారణపై అసంతృప్తి ఉన్నందున బదిలీ చేస్తున్నట్టుగా పేర్కొంది. వారికి బాధితులుగా ప్రాథమిక హక్కు పొందే హక్కు ఉంటుందని తెలిపింది. న్యాయం జరగుతుందని మాత్రమే కాదు.. అది జరిగేలా చూడటం కూడా ముఖ్యమని ధర్మాసనం పేర్కొంది.
కేసు విచారణ సమయంలో పెద్ద సంఖ్యలో సాక్షులను విచారించాల్సి ఉంటుందని.. ఆ సాక్షులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండ, విచారణను హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని అభిప్రాయపడినట్టుగా ధర్మాసనం తెలిపింది.
ఇక, వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ గత మూడేళ్లుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో టి గంగిరెడ్డి, జి ఉమా శంకర్ రెడ్డి, డి శివశంకర్ రెడ్డి, వై సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఆ తర్వాత దస్తగిరి ఈ కేసులో అప్రూవర్గా మారారు. అయితే ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవడానికి సీబీఐ ఇంకా విచారణ కొనసాగిస్తుంది.
అయితే సీబీఐ విచారణ ముందుకు సాగడం లేదని, చాలా సమయం తీసుకుంటోందని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులపై కేసులు నమోదు చేస్తున్నారని, అధికారులు ప్రతికూల వాతావరణంలో పనిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దర్యాప్తు పురోగతిని నేరుగా పర్యవేక్షించాలని, ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కేసును బదిలీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె సుప్రీంకోర్టును అభ్యర్థించారు.