పరీక్షలపై పక్కా సమాచారమేది... జగన్ సర్కార్ పై సుప్రీంకోర్ట్ అసంతృప్తి
పరీక్షల నిర్వహణపై జగన్ సర్కార్ దాఖలుచేసిన అఫిడవిట్పై ఇవాళ(గురువారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది.
న్యూడిల్లి: కరోనా సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు సిద్దమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై జగన్ సర్కార్ దాఖలుచేసిన అఫిడవిట్పై ఇవాళ(గురువారం) విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది.
''జులై చివరిలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని అఫిడవిట్లో చెప్పారు... దీనిపై పక్కా సమాచారం ఇవ్వాలని అడిగాం. అయితే అఫిడవిట్లో పక్కా సమాచారం ఎక్కడా కనిపించలేదు. పరీక్షల గురించి 15 రోజులు ముందుగా చెబుతామన్నారు. 15 రోజుల సమయం సరిపోతుందని ఎలా చెబుతారు?'' అని సుప్రీంకోర్టు ప్రశ్నించారు.
''పరీక్షల నిర్వహణ సిబ్బంది వివరాలు ఏవీ ఇవ్వలేదు. ప్రభుత్వమే అన్నిరకాల లాజిస్టిక్ వసతులు కల్పించాలి. విద్యార్థులతో పాటు సిబ్బంది రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. గాలి, వెలుతురు ఉండే గదుల్లో పరీక్షల నిర్వహణ వివరాల్లేవు'' అని న్యాయస్థానం పేర్కొంది.
read more శుభకార్యంలో డిజే పెట్టినందుకే చంపేస్తారా..?: టిడిపి కార్యకర్త హత్యపై నారా లోకేష్
''పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి చూస్తే సుమారు 28 వేల గదులు అవసరమవుతాయా? రెండో దశలో ఎలాంటి పరిస్థితి వచ్చిందో కళ్లారా చూశాం. కాబట్టి ఒక్కో గదిలో 15 నుండి 20 మంది విద్యార్థులను వుంచడం ఎలా సాధ్యమవుతుంది. సుమారు 34 వేలకుపైగా గదులు అవసరవుతాయి.. అది ఆలోచించారా? ఇంత పెద్ద మొత్తం గదులను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారు?'' అని సుప్రీంకోర్టు నిలదీసింది.
''పరీక్ష నిర్వహించాం.. పని అయిపోయింది అనుకోలేము కదా. పరీక్ష తర్వాత వాటిని మూల్యాంకనం చేయాలి.ఆ తర్వాత కూడా చాలా ప్రక్రియ ఉంటుంది. మూల్యాంకనం, తదనంతర ప్రక్రియ వివరాలు అఫిడవిట్లో లేవు'' అని నిలదీసింది.
''కరోనా రెండో దశను కళ్లముందు చూస్తున్నాం. పలు వేరియంట్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నా ఎందుకిలా వ్యవహరిస్తున్నారు. ఒక నిర్ణయాత్మక ప్రణాళిక ఉండాలి... మీ అఫిడవిట్లో అంతా అనిశ్చితే ఉంది'' అంటూ జగన్ సర్కార్ అఫిడవిట్ పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.