శుభకార్యంలో డిజే పెట్టినందుకే చంపేస్తారా..?: టిడిపి కార్యకర్త హత్యపై నారా లోకేష్
ప్రకాశం జిల్లాలో టిడిపి వర్గీయులపై దాడి, ఒకరి మృతి కేవలం ఆ ఒక్క జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి అధికార వైసిపి - ప్రతిపక్ష టిడిపి శ్రేణుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టిడిపి వర్గీయులపై దాడి జరగ్గా ఒకరు మృత్యువాతపడగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ దాడి వైసిపి వర్గీయుల పనేనని టిడిపి ఆరోపిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికన ఘాటుగా స్పందించారు. ''ప్రశాంత పల్లెల్ని కూడా ముఠాకక్షల కేంద్రాల్ని చేసిన ఫ్యాక్షన్ సీఎం జగన్ రెడ్డి గారూ! మీ కక్షపూరిత పాలనలో ఇంకెంతమంది టిడిపి కార్యకర్తల్ని బలితీసుకుంటారు? ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్యకర్త లక్కెపోగు సుబ్బారావుని వైసీపీ మూకలు హత్యచేయడం అత్యంత దారుణం'' అన్నారు.
read more చూస్తూ ఊరుకోం... అధికారంలోకి రాగానే గుణపాఠం తప్పదు: అచ్చెన్న వార్నింగ్
''ఇంట్లో శుభకార్యానికి డీజే పెట్టుకుంటే, ఓర్వలేని వైసీపీ వర్గీయులు దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే ఎంతగా బరితెగించారో అర్థం అవుతోంది. సుబ్బారావు కుటుంబానికి, గాయపడిన టిడిపి కార్యకర్తలకు టిడిపి అన్నివిధాలుగా అండగా నిలుస్తుంది'' అంటూ బాధిత కుటుంబానికి ధైర్యాన్నిచ్చే ట్వీట్ చేశారు లోకేష్.