లోకేశుడి సక్సెస్ ఫార్ములా...
చాలా రోజుల తర్వాత తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అకౌంట్ లో మేజర్ సక్సెస్ జమ అయింది
తెలుగుదేశం జనరల్ సెక్రెటరీ నారా లోక్ శ్ అకౌంట్ లో ‘పెద్ద ’అఛీవ్ మెంట్ నిన్న జమఅయింది.
ఆయన నేతృత్వంలోసాగుతున్న తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం సూపర్ సక్సెస్ కాబోతున్నది.
ఇప్పటికే 50 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆయన కేక్ కట్ చేసి చప్పట్లు కొట్టారు. అంతేకాదు, మొత్తం రాష్ట్రంలోని ఓటర్లలో 17 శాతం తెలుగుదేశం సభ్యలే అయి ఉండాలని కొత్త లక్ష్యం నిర్దేశించారు. 17 శాతమే ఎందుకు,18 శాతం ఎందుకు ఉండరాదు, 50 శాతం ఎందుకు వద్దు అని చాలా మందికి సంశయ కలిగినా, 17 సంఖ్యకు ఏదో మహత్తు ఉంటుందిలో అనుకుని కేక్ కటింగ్ కార్యక్రమానికి వచ్చిన చాలా మంది సంతృప్తి చెందారు.
చాలా కాలంగా లోకేశుడి అకౌంట్ లో చెప్పుకో దగ్గ అఛీవ్ మెంటేమీ జమకాలేదు. ఆయన చేపట్టిన చివరి మహాకార్యం తెలంగాణా జిహెచ్ ఎం సి ఎన్నిక. అక్కడ పరాజయం తర్వాత ఆయన కు పెద్ద పరీక్షలేమీ ఎదురుకాలేదు. అన్నీ పార్టీ వాళ్లు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, అక్కడి కొచ్చిన అభిమానుల అభిమానం వెల్లువ.
అయితే, ఇపుడు ఆయన ఆంధ్రలో విజయవంతమయినట్లే నని కేక్ చెబుతున్నది.
2014లో 50 రోజుల్లో 50 లక్షల సభ్యత్వాలు నమోదు కాగా, ఇప్పుడు కేవలం 38 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని చేరుకున్నట్లు, ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్బాబు, ఫిలిప్స్, ఎమ్మెల్సీలు వివివి చౌదరి, టిడి జనార్దన్, రామకృష్ణ, టిటిడి బోర్డు సభ్యులు ఎవి రమణ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ తదితరుల కరతాళ ధ్వనుల మధ్య లోకేశ్ ప్రకటించారు.
ఈ సక్సెస్ రహష్యం అనంతపురం లో బయటపడింది.
అదేమిటంటే, రేషన్ కు, టిడిపి సభ్యత్వానికి లింక్ వేశారట. లోకేశ్ ను గెలిపిండమే కాదు, తామూ కూడా భారీ గా మార్కులు కొట్టేసేందుకు, స్థానికి టిడిపి నాయకులు చౌకదుకాణాల డీలర్లు, ఉపాధి మేట్లను రంగంలోకి దించి వారి దగ్గిర వచ్చే ప్రతి కార్డు హోల్డర్ టిడిపి సభ్యత్వం తీసుకోవాలని షరతు పెట్టారట. ప్రభుత్వ పథకాలనుంచి లబ్ది పొందుతన్న వాళ్లంతా టీడీపీ సభ్యులు గాచేరాలి, మెంబర్ షిప్ రుసుం రు. 100 చెల్లించాల్సిందే.
ధర్మవరంలో ఈ విషయం బయటపడింది. ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 72,490 రేషన్ కార్డులు ఉన్నాయి. 41,819 మంది పింఛన్ దారులు ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం మందికి టీడీపీ సభ్యత్వం అంటగట్టేందుకు సరుకుల కోసం వచ్చే వారిని తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలంటూన్నారు. సభ్యత్వం కోసం వంద కట్టి సరుకులు తీసుకెళ్లండని, లేకపోతే ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారట.
పింఛన్ దారులకు ఇబ్బందులు తలెత్తకూడదని నేరుగా అకౌంట్లకు పింఛన్ మొత్తాలను జమ చేశారు. వారిలో చాలా మందికి అకౌంట్లు లేవు. కొన్ని ఆన్లైన్లో నమోదు కాలేదు అందువ్ల టిడిపి వాళ్లతో పేచీ పెడితే పెన్షన్ ఎగిరిపోతుంది. అధికార పార్టీ నాయకులు పింఛన్ రావాలంటే తప్పనిసరిగా రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని చెబుతున్నారట. నెలనెలా వచ్చే పెన్షన్ కోసం ఒక్క వందరుపాయలు చెల్లించలేరా అని వృద్ధులను, వికలాంగులను,అడుగుతున్నారట. పోయేది వందే కదా, ఇస్తే రేషన్ పెన్షన్ కచ్చితంగా వస్తాయని లబ్ధిదారులంతా టిడిపి మెంబర్లువుతున్నారట.