భూమా ఫ్యామిలీకి ఎస్పీవై రెడ్డి చెక్: ప్లాన్ ఇదీ.....
కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ టీడీపీ టిక్కెట్టు కోసం ఆ పార్టీ నేతల్లో పోటా పోటీ నెలకొంది
నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ టీడీపీ టిక్కెట్టు కోసం ఆ పార్టీ నేతల్లో పోటా పోటీ నెలకొంది. ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మనందరెడ్డి ఉన్నప్పటికీ కూడ శ్రీధర్ రెడ్డికి టిక్కెట్టు ఇవ్వాలని ఎంపీ ఎస్పీవై రెడ్డి డిమాండ్ చేయడం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు ఎంపీ స్థానం నుండి తానే బరిలోకి దిగనున్నట్టు ఎస్పీవై రెడ్డి ప్రకటించారు.
నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మరోసారి నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగనున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. విజయం సాధించిన వెంటనే టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీడీపీలోనే ఉన్నారు.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఆయన నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దిగనున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా ఈ దఫా ఎస్పీవై రెడ్డి ఈ దఫా పోటీ చేయకపోవచ్చనే ప్రచారం కూడ పార్టీ వర్గాల్లో ఉంది. కానీ, ఈ ప్రచారాన్ని పటా పంచలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ఎస్పీవై రెడ్డి ప్రకటించారు.
రెండేళ్ల క్రితం నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి టిక్కెట్టు కావాలని ఎస్పీవై రెడ్డి చంద్రబాబునాయుడును కోరారు. అయితే భూమా బ్రహ్మనందరెడ్డికి ఈ టిక్కెట్టును బాబు కేటాయించారు. దీంతో కొంత అసంతృప్తికి గురైన ఎస్పీవై రెడ్డి పార్టీ నాయకత్వం జోక్యం చేసుకోవడంతో ప్రచారంలో పాల్గొన్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టును తమకు ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డిని ఈ స్థానం నుండి పోటీ చేయించాలని ఎస్పీవై రెడ్డి పావులు కదుపుతున్నారు.
అయితే ఈ స్థానం నుండి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా భూమా బ్రహ్మనందరెడ్డిని కాదని శ్రీధర్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తారనే విషయంలో స్పష్టత లేదు. అయితే భూమా కుటుంబానికి ఒక్క టిక్కెట్టును మాత్రమే చంద్రబాబునాయుడు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది.
నిజంగా అదే జరిగితే ఏ స్థానంలో భూమా కుటుంబానికి టిక్కెట్టును కట్ చేస్తారో అనే చర్చ కూడ లేకపోలేదు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని భూమా వర్గీయులు చెబుతున్నారు. ప్రత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు.
నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టును శ్రీధర్ రెడ్డికి కేటాయించాలని కోరుతూ ఎస్పీవై రెడ్డి మరోసారి చంద్రబాబునాయుడు ముందు ప్రతిపాదనలు తీసుకువస్తున్నారు. బహిరంగంగానే విషయాన్ని ఎస్పీవై రెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాలు టీడీపీలో మరోసారి చర్చకు దారితీశాయి.ఈ నెల 17వ తేదీ లేదా ఆ తర్వాత కానీ చంద్రబాబునాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేసే చాన్స్ ఉంది.
సంబంధిత వార్తలు
వారందరికీ చంద్రబాబు షాక్: అఖిలప్రియకూ డౌటే?