విశాఖ భూ కుంభకోణంపై సిట్ దర్యాప్తు ముమ్మరం: వారికి మూడినట్టే...?
విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల్లో జిరాయితీ భూములను 22ఏలో చేర్చారని ఎందుకు అలా చేర్చాల్సి వచ్చిందో అన్న దానిపై తహాశీల్దార్లు సమాధానం చెప్పడం లేదని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే జిల్లా రిజస్ట్రార్ ఎస్.మన్మథరావు నుంచి నివేదిక తీసుకున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విశాఖపట్నం భూ కుంభకోణం ఆరోపణలపై సిట్ బృందం దర్యాప్తు వేగవంతం చేసింది. భూ కుంభకోణంకు సంబంధించి విచారణ చేపట్టిన సిట్ బృందం ప్రజల బాధితుల నుంచి ఫిర్యాదులు సేకరించింది.
విశాఖపట్నం భూ కుంభకోణం ఆరోపణలపై సిట్ దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసినట్లు సిట్ సభ్యురాలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ స్పష్టం చేశారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ, జిరాయితీ భూముల రికార్డులు భారీగా ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు సిట్ కు వచ్చిన ఫిర్యాదులను ఉప కలెక్టర్లకు అందజేసినట్లు తెలిపారు. ఉపకలెక్టర్లు పూర్తిస్థాయి విచారణ చేపడతారని అవసరమైతే క్షేత్రస్థాయి పర్యటన కూడా చేస్తారని వెల్లడించారు.
సిట్కు మొత్తం 2497 ఫిర్యాదులు వచ్చాయని తెలిపిన అనురాధా వాటిలో 1594 ఫిర్యాదులు సిట్ పరిధిలో వున్నాయని, నాన్ సిట్ పరిధిలో 914 ఉన్నట్లు తెలిపారు. సిట్ మొదటి దశ 13 మండలాలు పరిధిలో 1381 ఫిర్యాదులు, సిట్ రెండో దశలో ఇతర మండలాల్లో182 ఫిర్యాదులు అందాయని తెలిపారు.
రెండు విడతలుగా వచ్చిన ఫిర్యాదుల్లో 252 ఫిర్యాదులు ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించినట్లు స్పష్టం చేశారు. 204 ఫిర్యాదులు క్లాసిఫికేషన్ ఛేంజ్ అయినట్టు నిర్ధారించినట్లు తెలిపారు. ట్యాంపరింగ్ ఎక్కువగా ఆనందపురం మండలంలో జరిగాయని రెండో స్థానంలో పెందుర్తి , మూడో స్థానంలో భీమిలి మండలంలో జరిగినట్లు గుర్తించామని తెలిపారు.
విచారణలో భాగంగా ప్రభుత్వ భూముల ట్యాంపరింగ్ మీద దృష్టి పెట్టామని ఆ తర్వాత జిరాయితీ భూముల ట్యాంపరింగ్పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. పత్రిక పబ్లికేషన్ ఆధారంగా ఏడు అంశాల్లో ఫిర్యాదులు వచ్చినట్లు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ తెలిపారు.
సిట్ కు వచ్చిన ఫిర్యాదులను ఇప్పటికే ఉప కలెక్టర్లకు పంపించినట్లు తెలిపారు. వారి నుంచి నివేదిక వచ్చిన తర్వాత తాము విచారణ చేపడతామని స్పష్టం చేశారు. తొలివిడతగా తహాశీల్దార్లకు 35 ఫైల్స్ పంపినట్లు చెప్పుకొచ్చారు. వీటి విచారణ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామని అనురాధ తెలిపారు.
విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల్లో జిరాయితీ భూములను 22ఏలో చేర్చారని ఎందుకు అలా చేర్చాల్సి వచ్చిందో అన్న దానిపై తహాశీల్దార్లు సమాధానం చెప్పడం లేదని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే జిల్లా రిజస్ట్రార్ ఎస్.మన్మథరావు నుంచి నివేదిక తీసుకున్నట్లు వెల్లడించారు.
22 ఏ పేరిట అనేక భూములకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని, ఫలితంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించినట్లు స్పష్టం చేశారు. తహసీల్దార్లు కావాలని కొన్ని భూములను 22ఏ పెడుతున్నారన్న అనుమానం ఉందని వాటిపై పూర్తి స్థాయి విచారణ చేపడతామన్నారు.
సిట్ విచారణ కోసం అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం కేటాయించిందని, నలుగురు ఉప కలెక్టర్లు, నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు, 4 జూనియర్ అసిస్టెంట్లు, నాల్గోవ తరగతి సిబ్బంది సహకారంతో విచారణను వేగవంతం చేసినట్లు తెలిపారు.
వినతులు స్వీకరించడానికి కౌంటర్కు అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఈ కౌంటర్లో వినతులు స్వీకరిస్తున్నామని, సిబ్బంది రావడంతో విచారణ మరింత వేగవంతం అవుతుందని సిట్ బృందం సభ్యురాలు వైవీ అనురాధ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
విశాఖ భూకుంభకోణం... కలెక్టర్ తో సిట్ బృందం భేటి
విశాఖ భూకుంభకోణం...సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: గంటా