భార్య టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి... భర్తను బూటు కాలితో తన్నిన ఎస్సై
నాగులుప్పలపాడు స్టేషన్ నుంచి సిబ్బంది ఒంగోలు వచ్చి.. 2019లో నమోదైన మోసం కేసులో విచారణ కోసం స్టేషన్ కు రావాలని మురళిని కోరారు
పాత కేసు విషయంలో తనను స్టేషన్ కు పిలిపించిన ఎస్సై.. బూటుకాలుతో తన్ని, రైటింగ్ ప్యాడ్ తో కొట్టి గాయపరిచారని ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేటర్ అభ్యర్థి భర్త శుక్రవారం ఆరోపించారు.
బాధితుడు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఒంగోలు మంగమూరు రోడ్డు వడ్డెవానికుంటకు చెందిన జగన్నాథం మురళి ఎస్సీ కార్పొరేషన్ లో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య శారదాదేవి 33వ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
నాగులుప్పలపాడు స్టేషన్ నుంచి సిబ్బంది ఒంగోలు వచ్చి.. 2019లో నమోదైన మోసం కేసులో విచారణ కోసం స్టేషన్ కు రావాలని మురళిని కోరారు. ఆ కేసులో అప్పట్లోనే రాజీ చేసుకున్నామని.. ఇప్పుడు ఎందుకు పిలిపించారని ఎస్సై శశికుమార్ ని మురళి ప్రశ్నించారు.
ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఎస్సై తనను బూటుకాలుతో తన్ని, రైటింగ్ ప్యాడ్ తో దాడి చేసి.. దుర్భాషలాడారని మురళి ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అనుచరులతో కలిసి నాగులుప్పలపాడు వెళ్లారు.
కాగా.. అప్పటికే పోలీసులు మురళిని విడిచి పెట్టారు. అక్కడికి చేరుకున్న జనార్దన్ బాధితుడి చికిత్స నిమిత్తం ఒంగోలు జీజీహెచ్ కు తరలించారు. ఈ విషయమై ఒంగోలు గ్రామీణ సీఐ పి. సుబ్బారావు మాట్లాడుతూ... పెండింగ్ వారెంట్ విషయంలో మురళలిని నాగులుప్పలపాడు ఎస్సై స్టేషన్ కు పిలిపించిన మాట వాస్తవేమనన్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగిందని... మురళి భార్య టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తానన్న విషయం తమకు తెలీదన్నారు.