ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
విజయవాడ: భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుంచి కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5.69 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో ముంపు ప్రభావిత అధికారులను ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది.
3.96 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన సమయంలో మొదట ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 6.01 లక్షల క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. పులిచింతల ప్రాజెక్టు నుండి భారీగా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ప్రకాశం బ్యారేజీ వద్ద నీరు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు హెచ్చరించారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు.
వాగులు, వంకలు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, పశువులు-గొర్రెలు వదలడం లాంటివి చేయరాదని కన్నబాబు సూచించారు.
వంశధార నదికి వరద ఉధృతి
భారీ వర్షాలతో వంశధార నదికి వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 46,274 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 50,308 క్యూసెక్కులుగా ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.