అంబేద్కర్ బాటలోనే జగన్... స్వాతంత్య్రం తర్వాత ఇదే మొట్టమొదలు..: సజ్జల రామకృష్ణారెడ్డి
డాక్టర్ అంబేద్కర్ మన జాతి, దేశంతో పాటు ప్రపంచానికి కూడా మార్గదర్శం చేశారన్నారని వై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
తాడేపల్లి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహా నాయకుడని... ఆయన దేశానికి ఒక దిశా నిర్దేశం చేశారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆయన మన జాతి, దేశంతో పాటు ప్రపంచానికి కూడా మార్గదర్శం చేశారన్నారని... అవి ఎప్పటికీ స్మరణీయమన్నారు. సమసమాజం గమ్యంగా జాతిని నడిపించడానికి ఆయన అవిరళ కృషి చేశారని సజ్జల పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన వైయస్సార్సీపీ నేతలు ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూధన్రెడ్డితో పాటు పార్టీ నేతలు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ... ''ఆనాడు అంబేడ్కర్ ఆశించిన సమ సమాజం, ఆ తర్వాత తరం వారికి ప్రసంగాలకే పరిమితం అయింది. ఇక్కడ సీఎం వైయస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారి అంబేడ్కర్ ఆలోచన విధానం, దార్శనికత స్ఫూర్తిగా పని చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సీఎం వాటిని అమలు చేస్తున్నారు. ఆ దిశలో ఈ 20 నెలల్లోనే ఆయన సఫలీకృతులయ్యారు'' అన్నారు.
''స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో జరగనిది ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నం సఫలం అవుతోంది. మహిళల సాధికారత, రాజకీయంగా దళితులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, కుల మతాలకు అతీతంగా పేదల అభివృద్ధి కోసం సీఎం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రక్రియలో సంకుచిత రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా భాగస్వాములు కావాలి'' అని సజ్జల పేర్కొన్నారు.