నిన్న అసహనంతో మాట్లాడా.. క్షమించండి: వెనక్కితగ్గిన సబ్బంహరి
ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతోందన్నారు మాజీ ఎంపీ సబ్బంహరి. నిన్న తాను సహనం కోల్పోయి మాట్లాడానని.. తనను మన్నించాలని ఆయన కోరారు
ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతోందన్నారు మాజీ ఎంపీ సబ్బంహరి. నిన్న తాను సహనం కోల్పోయి మాట్లాడానని.. తనను మన్నించాలని ఆయన కోరారు.
తాను మేయర్గా ఉన్నప్పుడు స్థలం కొనలేదని, ఎంపీగా ఉన్నప్పుడు ఇళ్లు కట్టలేదని సబ్బంహరి వెల్లడించారు. తాను నెల రోజుల కిందటే విశాఖ కలెక్టర్కు లేఖ రాశానని.. తనపై అభియోగాలు వస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానిజాలు తెలుసుకొని చర్యలు తీసుకోమన్నానని సబ్బంహరి స్పష్టం చేశారు. కాగా శనివారం ఉదయం తెల్లవారుజామున అక్రమ కట్టడాలని చెప్పి సబ్బంహరి ఇంటికి అనుకొని ఉన్న రూమ్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు.
అయితే ముందుగా సమాచారం ఇవ్వకుండా.. వేకువ జాము సమయంలో జేసీబీలతో ఎలా కూల్చివేస్తారని సబ్బం హరి అధికారులుపై మండిపడ్డారు. కూల్చివేతలపై సమాధానం ఇవ్వడానికి జీవీఎంసీ అధికారులు నిరాకరించారు.
ఏదన్నా అక్రమ కట్టడమా.. అక్రమకట్టడం అయితే పేపర్లు చూపిస్తే ఓ గంటలో తానే ఆ రూమ్ని కూల్చేస్తానని చెప్పినా.. అధికారుల నుంచి సమాధానం లేదన్నారు. వేకుమజామున నాలుగున్నరకి తెల్సినోళ్లు నిద్రలేపారని.. ఏమి జరుగుతుందో అసలేం అర్ధం కాలేదన్నారు.