పట్టు బడ్డ రూ. 90 కోట్లు, 100 కిలోల బంగారం
తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు సభ్యులలో కొందరు చిన్న వెంకటేశ్వర స్వామి అవతారాలు ఎత్తినట్లున్నారు.
ఆదాయం విషయంలో శ్రీవారి హుండీకి, టిటిడి బోర్డు సభ్యుల్లో కొందరికి పెద్ద తేడా లేనట్లే ఉంది. టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై ఐటి అధికారులు చేసిన దాడుల్లో డబ్బు, బంగారం పెద్ద ఎత్తున పట్టుబడటం ఇపుడు కలకలం రేపుతోంది.
తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు సభ్యులలో కొందరు చిన్న వెంకటేశ్వర స్వామి అవతారాలు ఎత్తినట్లున్నారు. ఎందుకంటే, 365 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా తిరుమలలోని శ్రీవారి హుండీ ఆదాయానికి ఎటువంటి ఢోకా ఉండదు. అదే విధంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని కోట్లాదిమంది సామాన్య ప్రజలు ‘చిన్న నోట్లో రామచంద్రా’ అంటూ అల్లాడిపోతున్నారు.
ఇదంతా ఎందుకంటే, చెన్నైలో ఉండే వ్యాపార వేత్త, టిటిడి బోర్డు సభ్యడు శేఖర్ రెడ్డి ఇంట్లో రూ. 90 కోట్లు పట్టుపడ్డాయి. తగిన సమాచారం మేరకు ఐటి అధికారులు గురువారం రెడ్డి ఇంటిపైన దాడి చేసారు. దాడిలో వెలుగు చూసిన డబ్బు, బంగారం చూసి ఐటి అధికారులే విస్తుపోయారట.
దాడుల్లో అధికారులు రూ. 90 కోట్ల నగదు, మరో రూ. 100 కెజిల బంగరం నగలను కనుగొన్నారు. ఇందులో విశేషం ఏమిటంటే, పట్టుబడ్డ రూ. 90 కోట్ల నగదులో రూ. 70 కోట్లు కొత్త 2 వేల రూపాయల నోట్ల కట్టలే. బోర్డు సభ్యుని ఇంట్లో దాడుల్లో పట్టుబడ్డ నగదు, బంగారంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. రెడ్డి ఇంటితో పాటు అతనికి సంబంధించిన ప్రేమ్, శ్రీనివాసరెడ్డి ఇళ్ళపై కూడా దాడులు జరిగాయి. వివరాలు ఇంకా రావల్సి ఉన్నాయి.