గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటోను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు మృతిచెందగా 13మంది తీవ్రంగా గాయపడ్డారు. 

గుంటూరు: తెలుగురాష్ట్రాలో చలితీవ్రత పెరిగి తెల్లవారుజామున కురుస్తున్న పొగమంచు ప్రమాదాలకు దారితీస్తోంది. ఇలా ఇవాళ(సోమవారం) ఆంధ్ర ప్రదేశ్ (andhra pradesh) గుంటూరు జిల్లా (guntur district)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున కూలీలతో వెళుతున్న ఓ ఆటోను ఎదురుగా అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14మంది కూలీలు గాయపడగా వారిలో ముగ్గురితో పాటు ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా వుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ప్రమాదానికి (guntur accident) సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేట (chilakaluripet) పట్టణంలోని మద్ది నగర్ వడ్డెర కాలనీకి చెందిన కొందరు మహిళా కూలీలు ఇవాళ తెల్లవారుజామున ఆటోలో తుమ్మలపాలెం (thummalapalem)కు పత్తి తీసేందుకు బయలుదేరారు. ఒకే షేరింగ్ ఆటోలో సామర్థ్యానికి మించి ఏకంగా 14మంది కూలీలు ప్రయాణించసాగారు. 16వ నెంబరు జాతీయ రహదారి (చెన్నై- కలకత్తా)పై ప్రమాణిస్తుండగా మార్గమధ్యలో యడ్లపాడు వద్ద ఈ ఆటో పైకి ఒక్కసారిగా ప్రమాదం కారు రూపంలో దూసుకొచ్చింది.

Video

16వ నెంబర్ జాతీయ రహదారిపై (chennai colcutta highway) అతివేగంతో వెళుతున్న ఓ కారు కూలీలతో వెళుతున్న ఈ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ముందుకూర్చున్న ముగ్గురు కూలీలతో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది. వెనకాల కూర్చున్న కూలీలు కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగినా కారు ఆపకుండానే అదే వేగంతో వెళ్ళిపోయింది. 

Read More నూజివీడులో ఘోర ప్రమాదం.. లారీ ఢీకొనడంతో తల్లీ బిడ్డల దుర్మరణం

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన యడ్లపాడు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన మహిళలను, ఆటో డ్రైవర్ ను అంబులెన్స్ లో దగ్గర్లోని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ (guntur government hospital) కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో షేక్ దరియాబి(55), బేగం(52) మృతిచెందారు. ఇంకా ఆటో డ్రైవర్ తో పాటు మరో మహిళ పరిస్థితి విషమంగా వుందని డాక్టర్లు తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

తెల్లవారుజామున పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగివుంటుందని అనుమానిస్తున్నారు. కారు అతివేగంతో ఢీకొట్టడంతో ఆటో ముందుబాగం పూర్తిగా ధ్వంసమయ్యింది. ప్రమాద స్థలంంలో కూలీల వస్తువులు, టిఫిన్ బాక్సులు, ఆటో పార్ట్స్ చెల్లాచెదురుగా పడటంతో పాటు రహదారి రక్తసిక్తంగా మారి భయానక వాతావరణం ఏర్పడింది. గాయపడిన కూలీలతో పాటు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబసభ్యులు ఆర్తనాదాలు మిన్నంటాయి.

Read More Visakhapatnam Road accident: 20మంది ప్రయాణికులతో వెళుతూ బొలేరో బోల్తా... ఒకరు మృతి

ప్రమాదస్థలాన్ని పరిశీలించిన యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాదస్థలానికి దగ్గర్లోని సిసి కెమెరాలను పరిశీలించి కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.