వంగవీటి వివాదంలో వర్మ ఆజ్యం
- ‘ఎద్దుపుండు కాకికి ముద్దు’ అనే సామెత రామ్ గోపాల్ వర్మకు సరిగ్గా సరిపోతుంది.
- రెండు వర్గాల మధ్య ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళనతో స్ధానికులు భయపడుతుంటే తల్లీ, కొడుకులను వెటకారం చేయటానికి వర్మకు ఇంతకన్నా సమయం దొరకలేదు.
- పోలీస్ స్టేషన్లో తల్లీ, కొడుకులు కింద కూర్చుని ఉన్న ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి.. కొన్ని వివాదాస్పద రాతలు పోస్టు చేసాడు.
‘ఎద్దుపుండు కాకికి ముద్దు’ అనే సామెత రామ్ గోపాల్ వర్మకు సరిగ్గా సరిపోతుంది. సస్పెండైన వైసీపీ నేత గౌతమ్ రెడ్డి రేపిన చిచ్చు అందరికీ తెలిసిందే. వంగవీటి రంగాపై గౌతమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రంగా భార్య వంగవీట రత్నకుమారి, కొడుకు రాధాకృష్ణతో పాటు రంగా అభిమానులు మండిపోతున్నారు. గౌతమ్ ఇంటిపైకి దాడికి ప్రయత్నింటచంతో ఆదివారం ఉదయం నుండి విజయవాడలో పరిస్ధితిలు ఉద్రిక్తంగానే ఉన్నాయనే చెప్పాలి.
అటువంటి పరిస్ధితిలో సంచలన, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( ఆర్జీవీ) మరింత ఆజ్యం పోసారు. రెండు వర్గాల మధ్య ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళనతో స్ధానికులు భయపడుతుంటే తల్లీ, కొడుకులను వెటకారం చేయటానికి వర్మకు ఇంతకన్నా సమయం దొరకలేదు.
నిన్న విజయవాడలో పోలీస్ స్టేషన్లో తల్లీ, కొడుకులు కింద కూర్చుని ఉన్న ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి.. కొన్ని వివాదాస్పద రాతలు పోస్టు చేసాడు. దాంతో వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయ్. ఆ ఫొటోలపై వర్మ ‘వంగవీటి రంగా భార్య, కొడుకు అంటే ఎనలేని ప్రేమ’ అంటూ వెటకారపు పోస్ట్ పెట్టాడు. అంతేకాదు, ‘స్టేషన్లో ఇలా కూర్చున్నందుకు వంగవీటి రంగా తన భార్య, కొడుకును చూసుకుని ఎంతో గర్వంగా ఫీలవుతాడని, స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ కూడా వేస్తాడ’ని పోస్ట్ పెట్టి రాంగోపాల్ వర్మ సరికొత్త వివాదాన్ని లేపాడు.
అంతటితో ఆగితే తాను వర్మ ఎందుకవుతాడు? ‘తల్లి ఎందుకు నల్లగా ఉందో, కొడుకు ఎందుకు తెల్లగా ఉన్నాడో లోరియల్ కాస్మొటిక్ కంపెనీ చెప్పాల’ని చేసిన పోస్టుపై పెనుదుమారమే రేగుతోంది. రాంగోపాల్ వర్మ వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించే సమయంలో ఆ కుటుంబం అతనికి సహకరించకపోవడమే ఈ వికృతానందానికి కారణమని నెటిజన్లు భావిస్తున్నారు.