తిరుపతిలో నకిలీ టిక్కెట్లు: మోసపోయిన చెన్నై భక్తుడు, ఫిర్యాదు
తిరుపతిలో నకిలీ టిక్కెట్ల వ్యవహారం సోమవారం నాడు వెలుగు చూసింది.
తిరుపతి: తిరుపతిలో నకిలీ సుప్రభాతం, అభిషేకం టిక్కెట్లను విక్రయాలు జరిగినట్టుగా సోమవారంనాడు వెలుగు చూసింది. బాధితులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చెన్నైకు చెందిన రవి నారాయణ అనే వ్యక్తి తన బంధువు ద్వారా రాహుల్ అనే మద్య దళారీని ఆశ్రయించాడు. తిరుపతిలో 18 అభిషేకం, 10 సుప్రభాతం టిక్కెట్లను రవి నారాయణ కొనుగోలు చేశాడు. ఈ మేరకు దళారీకి రవి నారాయణ రూ. 70 వేలు చెల్లించినట్టుగా బాధితుడు చెబుతున్నారు.
సోమవారం నాడు రవి నారాయణ తిరుపతికి స్వామి దర్శనం కోసం వచ్చాడు. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రవి నారాయణ వద్ద ఉన్న టిక్కెట్లను విజిలెన్స్ విభాగం అధికారులు గుర్తించారు. ఈ టిక్కెట్లను నకిలీవిగా తేల్చారు. అయితే ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.
ఇప్పటికే నకిలీ వెబ్సైట్ల ద్వారా టీటీడీకి చెందిన టిక్కెట్లను విక్రయిస్తున్న విషయాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇప్పటికే 9 వెబ్సైట్లను బ్లాక్ చేసింది. మరో 20 నకిలీ వెబ్ సైట్లపై టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించారు.