వైసిపిని వదిలేది లేదు..స్పష్టం చేసిన రాధా
- వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో విజయవాడ వైసిపి నేత వంగవీటి రాదాకృష్ణ అత్యవసరంగా భేటీ అయ్యారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో విజయవాడ వైసిపి నేత వంగవీటి రాదాకృష్ణ అత్యవసరంగా భేటీ అయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్ లోని జగన్ నివాసం లోటస్ పాండ్ లో వీరిద్దరూ సమావేశమయ్యారు. రాధా త్వరలో వైసిపిని వదిలేసి టిడిపిలో చేరుతారంటూ ఈమధ్యలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇద్దరి భేటీలో కూడా ఇదే విషయం ప్రధానంగా ప్రస్తావన జరిగినట్లు సమాచారం.
రాధ టీడీపీలో చేరతారన్న పుకార్లపై సుమారు అరగంట పాటు చర్చించారు. అయితే ఎట్టకేలకు వంగవీటి పార్టీ మార్పు విషయంపై స్పష్టత వచ్చేసింది. టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారమంతా అవాస్తవమని జగన్ తో రాధా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. తనపై కొందరు కావాలనే పనిగట్టుకుని ఇలా దుష్ప్రచారం చేశారని మీడియాకు రాధ వివరణ ఇచ్చారు. పార్టీ మారే ప్రసక్తే లేదని. ప్రాణమున్నంత వరకూ వైసీపీలోనే కొనసాగుతానని రాధాకృష్ణ మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి వంగవీటి రాధా తనపై వస్తున్న ఆరోపణలకు తెరదించారు. అయితే ఇకనైనా రూమర్స్ ఆగుతాయో లేదో చూడాల్సిందే మరి.