అందుకే రాజీనామా చేశా: పురంధేశ్వరి వివరణ
భద్రచలంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ గత ప్రభుత్వం బిల్లు పెట్టనందుకే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశానని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు.
భద్రచలంలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ గత ప్రభుత్వం బిల్లు పెట్టనందుకే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశానని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపింది బిజెపినే అని ఆమె మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సహకరించడం లేదని చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. కేంద్ర పథకాలను చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్సించారు. కడప ఉక్కు కర్మాగారంపై కూడా టీడీపీ కేంద్రంపై తప్పుడు ప్రచారం సాగిస్తోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరింది చంద్రబాబు నాయుడేనని ఆమె స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన విషయంపై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు.
జమిలి ఎన్నికలకు వెళ్లాలని బిజెపి గట్టిగానే భావిస్తోందని, అయితే నిర్ణయం తీసుకోవాల్సింది ఎన్నికల కమిషనేనని పురంధేశ్వరి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1935 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి కేంద్రానికి ఇంకా నివేదిక అందలేదని ఆమె తెలిపారు. పోలవరం కోసం బీజేపీ చిత్త శుద్ధితో పనిచేస్తోందన్నారు. సిమెంట్ రోడ్లు, 24 గంటల కరెంట్ కేంద్రం ఇస్తుంటే చంద్రబాబు తన పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. స్టీల్ప్లాంట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు ఇవ్వలేదని చెప్పారు.