తిరుపతిలో అమానుషం... హాస్పిటల్ ముందే నడిరోడ్డుపై నిండుగర్భిణి ప్రసవం
పురిటినొప్పులతో వచ్చిన నిండు గర్భిణికి వైద్యం చేసేందుకు హాస్పిటల్ సిబ్బంది నిరాకరించడంతో నడిరోడ్డుపైనే బిడ్డను ప్రసవించిన అమానవీయ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది.
తిరుపతి : ఆడబిడ్డ అన్న జాలి లేదు... నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ ఒంటరిగా వచ్చిందంటే ఎంత బాధలో వుండివుంటుందో కూడా వారికి అర్థం కాలేదు... చివరకు తమ కనీస బాధ్యతను కూడా మరిచి గర్భిణికి వైద్యం చేయడానికి నిరాకరించారు తిరుపతిలో మెటర్నిటీ హాస్పిటల్ వైద్యసిబ్బంది. దీంతో ఏ దిక్కులేని మహిళ పురిటినొప్పులను పంటిబిగువన భరిస్తూ నడిరోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది.
వివరాల్లోకి వెళితే... ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి జిల్లా హాస్పిటల్ కు నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ వెళ్లింది. సహాయకులు లేకుండా ఒంటరిగా వచ్చిందన్న కారణంగా ఆమెకు వైద్యం చేసేందుకు సిబ్బంది నిరాకరించినట్లు సమాచారం. వైద్యం కోసం హాస్పిటల్ సిబ్బంది కాళ్లా వేళ్లా పడ్డా ఫలితం లేకపోవడంతో పురిటినొప్పుతోనే గర్భిణి బయటకు వచ్చింది. ఇలా బయట రోడ్డుపైకి రాగానే నొప్పులు ఎక్కువై రోడ్డుపై పడిపోయింది. అయినా హాస్పిటల్ సిబ్బంది ఏమాత్రం కనికరం చూపించకుండా అలాగే చూసిచూడనట్లు వదిలేసారు.
పురిటినొప్పులతో గర్భిణి రోడ్డుపై పడటం చూసిన కొందరు మహిళలు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పనిచేసే వ్యక్తి ముందుకువచ్చి ఆమెకు రోడ్డుపైనే ప్రసవం చేసాడు. ఈ సమయంలో కొందరు మహిళ చుట్టూ దుప్పట్లను అడ్డుగా పట్టుకున్నారు. గర్భిణ నొప్పులను భరించలేక గట్టిగా అరుస్తూ రోడ్డుపైనే బిడ్డను ప్రసవించింది. ఇలా రోడ్డుపైనే ప్రసవం జరిగినా తల్లీ, బిడ్డా క్షేమంగా వున్నారు.
Read more నరసరావుపేట యువకుడు మిస్సింగ్ కేసులో.. ‘దృశ్యం’ స్టోరీ తలపించే మలుపులు..అసలు విషయం ఏంటంటే...
హాస్పిటల్ ఎదుటే మహిళ రోడ్డుపై ప్రసవవేదన అనుభవించడం, సాటి మనుషలు ఆమెకు సహాయం చేయడాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అదికాస్తా వైరల్ గా మారి వైద్యసిబ్బంది తీరుపై నెటిజన్ల నుండి ఆగ్రహం వ్యక్తంమవుతోంది. చివరకు ఈ అమానుష ఘటన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దృష్టికి వెళ్ళింది. ఈ ఘటనపై తిరుపతి జిల్లా ఆరోగ్యశాఖ ఇంచార్జ్ శ్రీహరి స్పందించారు. ఇప్పటికే ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించామని... అమానవీయంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.