రాయలసీమ ఎత్తిపోతల పథకం: ఏపీ స్పీడుకు కేంద్రం బ్రేకులు.. అనుమతుల ప్రక్రియ నిలిపివేత
కృష్ణానదిపై నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది.
కృష్ణానదిపై నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది. ఇటీవల కేంద్రం, కృష్ణా జలాల ట్రైబ్యునల్కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆరు అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని కేంద్ర పర్యావరణ శాఖ వివరణ కోరింది. ఎన్జీటీ అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని, ప్రాజెక్టు డ్రాయింగ్స్, లే అవుట్లు, చార్టుల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ప్రాజెక్టు ద్వారా ఎంత మేరకు నీటిని వాడుకుంటారు. భూసేకరణ, ఆయకట్టు వివరాలు స్పష్టం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.
Also Read:ఏపీ ప్రాజెక్ట్లపై అభ్యంతరం.. కృష్ణానదీపై కొత్త ఆనకట్ట నిర్మాణం : తెలంగాణ కేబినెట్ నిర్ణయం
గతంలో తెలుగుగంగకు ఇచ్చిన అనుమతులలో ఏపీ ప్రభుత్వం పలు సవరణలు కోరగా... సవరణలు కోరుతూ ఇచ్చిన దరఖాస్తులో స్పష్టత లేదని కేంద్ర పర్యావరణశాఖ తెలిపింది. ఏయే అంశాలకు అనుమతులు కావాలి, ఏయే అంశాలకు సవరణలు కావాలో స్పష్టం చేయాలని కోరుతూ 24 పేజీలతో కూడిన లేఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపింది. ఏపీ ప్రభుత్వం వివరణ తర్వాతే పర్యావరణ అనుమతుల ప్రక్రియ ముందుకు సాగుతుందని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.