ఏపీ ప్రాజెక్ట్లపై అభ్యంతరం.. కృష్ణానదీపై కొత్త ఆనకట్ట నిర్మాణం : తెలంగాణ కేబినెట్ నిర్ణయం
ఏపీ నిర్మిస్తోన్న పలు ప్రాజెక్ట్లపై తెలంగాణ కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కాల్వల నిర్మాణం సరైంది కాదని కేబినెట్ స్పష్టం చేసింది. ఈ అక్రమ ప్రాజెక్ట్లపై ఎన్జీటీ, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేబినెట్ నిర్ణయించింది
ఏపీ నిర్మిస్తోన్న పలు ప్రాజెక్ట్లపై తెలంగాణ కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కాల్వల నిర్మాణం సరైంది కాదని కేబినెట్ స్పష్టం చేసింది. ఈ అక్రమ ప్రాజెక్ట్లపై ఎన్జీటీ, సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం ఆదేశించినా ఏపీ సర్కార్ ఖాతరు చేయడం లేదని.. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం ఎంతదూరమైనా వెళ్తామని కేబినెట్ స్పష్టం చేసింది. ఏపీ అక్రమ ప్రాజెక్ట్ల కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడింది.
కృష్ణానదిపై జోగులాంబ బ్యారేజ్ నిర్మాణం చేస్తామని తెలిపింది. 70 టీఎంసీల వరద నీటిని పైపుల ద్వారా తరలించేందుకు కేబినెట్ నిర్ణయించింది. పులిచింతల ఎడమ కాల్వ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రిమండలి తెలిపింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 20 టీఎంసీలకు నిల్వ సామర్థ్యం పెంచడంతో పాటు ఏపీ ప్రాజెక్ట్లపై పార్లమెంట్లో నిలదీస్తామని కేబినెట్ పేర్కొంది. ఏపీ ప్రాజెక్ట్లతో జరిగిన నష్టాన్ని ప్రజలు వివరిస్తామని వెల్లడించింది.
అంతకుముందు తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పూర్తిగా నియంత్రణలోకి రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అన్ని రకాల ఆంక్షల్ని, నిబంధనల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గాయని కేబినెట్ అభిప్రాయపడింది. వైద్య ఆరోగ్య శాఖ నివేదికను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
Also Read:మాస్క్, శానిటైజేషన్ తప్పనిసరి.. లేకుంటే రూ. వెయ్యి జరిమానా: తెలంగాణ అన్లాక్ గైడ్లైన్స్ ఇవే
జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్నట్లు సర్కార్ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. టిమ్స్ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. చెస్ట్ ఆసుపత్రి, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణాల్లో ఆసుపత్రులను నిర్మించనున్నారు. అల్వాల్ నుంచి ఓఆర్ఆర్ మధ్యలో మరో ఆసుపత్రి నిర్మాణానికి కేబినెట్ ఓకే చెప్పింది.