Asianet News TeluguAsianet News Telugu

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అరెస్ట్‌కు రంగం సిద్దం..!

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ గత అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో నిర్వహించారు. సుబ్రహ్మణ్యం మృతి కేసులో పోలీసులు ఉదయభాస్కర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు.

Police likely to Arrest YSRCP MLC Anantha Uday Bhaskar
Author
Kakinada, First Published May 22, 2022, 12:09 PM IST

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ గత అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో నిర్వహించారు. ఈ మొత్తం పోస్టుమార్టమ్ ప్రక్రియను వీడియో తీశారు. ఇక, సుబ్రహ్మణ్యం మృతి కేసులో పోలీసులు ఉదయభాస్కర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ అదుపులోకి తీసుకుంటామని అర్ధరాత్రి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. అనుమానస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చినట్టుగా వెల్లడించారు. ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేస్తామని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు తెలిపారు. 

అయితే సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలో అతడికి కొట్టి చంపినట్టుగా తేలిందని సమాచారం. మృతుడి బట్టలపై బీచ్‌లో మట్టి, ఇసుక.. ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులు, సుబ్రహ్మణ్యం తల మీద ఎడమవైపు గాయం ఉన్నట్టుగా వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎడమ కాలు బొటన వేలుపై, కుడి కాలు మడెం దగ్గర, ఎడమ చేయి, పై పెదవిపై గాయాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారని సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉదయభాస్కర్‌ను ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరోవైపు అనంత ఉదయభాస్కర్ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇక, ఈ కేసులో ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కాకినాడ జీజీహెచ్ వద్ద నిరసనకు దిగారు. సుబ్రహ్మణ్యం మృతిపై టీడీపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు శనివారం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అపర్ణ శనివారం పగలు కనిపించకుండా పోయారు. 

Also Read: సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి: కేసులో ప్రధాన నిందితుడిగా వైసీపీ ఎమ్మెల్సీ ఉదయభాస్కర్

ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. చివరకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను సాయంత్రం పోలీసులు కాకినాడ జీజీహెచ్‌ మార్చురీ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం శవ పంచనామా నిర్వహించారు. అయినప్పటికీ పోస్టుమార్టమ్ అంగీకారపత్రంపై సంతకాలు చేసేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇక, ఈ కేసులో ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేస్తామని శనివారం రాత్రి ఎస్పీ ప్రకటించారు. 

తొలుత మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించామని.. ఆ మేరకు సెక్షన్ 302 కిందకు మారుస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ కేసు కూడా పెడతామన్నారు. కేసు నమోదయ్యాక పోస్టుమార్టం చేసిన తర్వాతే.. దాని నివేదిక ప్రకారం కేసులో సెక్షన్లు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎస్పీ ప్రకటన తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. 

పోస్టుమార్టమ్ అనంతరం సుబ్రహ్మణ్యం స్వగ్రామం పెదపూడి మండలం జి మామిడాడకు తరలించారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి నేడు అంత్యక్రియలు నిర్వహించారు. ఇక, బాధిత కుటుంబాన్ని అదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios