- Home
- Andhra Pradesh
- Tirupati Darshan Tips : 30 నిమిషాల్లోనే శ్రీవారిని దర్శించుకొండి.. ఈ ఫాస్ట్ ట్రాక్ దర్శనం ఫ్రీ.. ఎలా చేసుకోవాలో తెలుసా?
Tirupati Darshan Tips : 30 నిమిషాల్లోనే శ్రీవారిని దర్శించుకొండి.. ఈ ఫాస్ట్ ట్రాక్ దర్శనం ఫ్రీ.. ఎలా చేసుకోవాలో తెలుసా?
ఏడుకొండలపై వెలిసిన ఆ కలియుగ ప్రత్యక్షదైవం వెెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళుతున్నారా? అయితే చాలా ఈజీగా శ్రీవారిని దర్శించుకునే టిప్స్ మీకోసమే. మీరు అర్హులయితే చాలా ఈజీగా స్వామిని దర్శించుకోవచ్చు.

తిరుమల శ్రీవారి దర్శనం టిప్స్..
Tirumala Darshan Tips : తిరుమల తిరుపతి దేవస్థానం... భారతీయులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పుణ్యక్షేత్రం. దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో తిరుమల టాప్ లో ఉంటుంది... భక్తుల పరంగా కూడా అత్యంత రద్దీగా ఉండే ఆలయం. కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది తిరుమలకు తరలి వెళుతుంటారు. శ్రీవారి ఆలయ హుండీ ఆదాయమే రోజుకు రూ.3-5 కోట్ల వరకు ఉంటుంది... స్వామివారికి తలనీలాలు సమర్పించేవారి సంఖ్య రోజుకు 40,000-50,000 వరకు ఉంటుంది... దీన్నిబట్టే తిరుమలలో రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా శ్రీవారిని దర్శించుకోవాలంటే 12 నుండి 24 గంటల సమయం పడుతుంది... ఇది మామూలు రోజుల్లో సంగతి. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలు, వరుసగా సెలవులు వస్తే భక్తుల రద్దీ మరింత పెరిగి ఏకంగా దర్శనానికి రెండుమూడు రోజుల సమయం పడుతుంది. ఇలాంటిది తిరుమల శ్రీవారిని కేవలం అరగంట లేదా గంటసేపట్లో దర్శనం చేసుకుంటే... వాళ్లు అదృష్టవంతులే. అయితే కొందరికి ఇలాంటి అరుదైన అవకాశం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అరగంటలో శ్రీవారి దర్శనం... ఎవరికో తెలుసా?
తిరుమలకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారు... వీరిలో చాలామంది వృద్ధులు కూడా ఉంటారు. ఇటీవల ఓ వందేళ్లు పైబడిన వృద్ధురాలు కాలినడకన ఏడుకొండలు ఎక్కి శ్రీవారిని దర్శించుకున్న వార్త వైరల్ అయ్యింది. ఇలా స్వామివారిపై భక్తితో తిరుమలకు వచ్చే వృద్ధులు రద్దీ కారణంగా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసింది టిటిడి. 65 ఏళ్లు పైబడిన ముసలివారికి ప్రత్యేక మార్గంలో దర్శనం కల్పిస్తారు... ఈ క్యూలైన్ లో ఏమాత్రం రద్దీ ఉండదు. అందుకే కేవలం 30 నిమిషాల్లోనే శ్రీవారిని దర్శించుకుని ఆలయంలోంచి బయటకు రావచ్చు.
అయితే ఈ దర్శనం రోజంతా ఉండదు... కొన్నిగంటలే వృద్ధులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ దర్శనానికి సమయం కేటాయించారు. 65 ఏళ్లు దాటిన భక్తులు తమ ఫోటో ఐడీ, వయసు ధ్రువీకరణ పత్రాన్ని S-1 కౌంటర్లో చూపించాలి. తర్వాత ఆలయానికి కుడివైపు గోడ పక్కన, వంతెన కింద ఉన్న మండపం ద్వారా వెళ్లాలి. ఈ దారిలో ఎలాంటి మెట్లు ఉండవు కాబట్టి, వృద్ధులు సులభంగా నడిచి వెళ్లొచ్చు.
క్యూ లైన్లోకి వెళ్లిన తర్వాత మినిమం 30 నిమిషాలు, గరిష్ఠంగా గంటసేపట్లో స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు రావచ్చు. దర్శనం తర్వాత వృద్ధులందరికీ వేడివేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పాలు ఉచితంగా అందిస్తారు. అంతేకాకుండా పార్కింగ్ స్థలం నుంచి కౌంటర్కు, అక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం వరకు బ్యాటరీ కార్ల సౌకర్యం కూడా ఉంది.
చిన్నారుల పేరేంట్స్ కి కూడా తిరుమలలో ప్రత్యేక దర్శనం
కేవలం వృద్ధులే కాదు చంటి పిల్లలను కలిగిన పేరెంట్స్ కూడా తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా దర్శించుకోవచ్చు... వీరికోసం కూడా టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సంవత్సరంలోపు వయసున్న పిల్లలను కలిగిన పేరెంట్స్ సాధారణ దర్శన మార్గంలో కాకుండా ప్రత్యేక మార్గంలో దర్శనానికి వెళ్లవచ్చు. ప్రతిరోజు ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ 'శిశు దర్శనం' అవకాశం కల్పిస్తోంది టిటిడి. శ్రీవారి ఆలయం పక్కనున్న సుపథం మార్గంలో వీరికి అనుమతి ఇస్తారు.
ఏడాది వయసు శిశువుతో పాటు తల్లి, తండ్రి, 12 సంవత్సరాల లోపు మరో బిడ్డకు ఈ ప్రత్యేక దర్శన అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం పిల్లవాడు ఏడాదిలోపు వయసు ఉన్నట్లు ద్రువీకరించే భర్త్ సర్టిఫికేట్ లేదా ఇతర ఏవైనా అధికారిక పత్రాలు తప్పనిసరి. తల్లిదండ్రులు కూడా ఆదార్ కార్డు సమర్పించాలి. ఈ శిశు దర్శనానికి ముందస్తుగా టికెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు... ఇది పూర్తిగా ఉచితం.

