చంద్రబాబు కోసం బెజవాడకి .. పవన్ ప్రత్యేక విమానానికి పోలీసుల అనుమతి నిరాకరణ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి వుందని పోలీసులు స్పష్టం చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబును కలిసేందుకు పవన్ బెజవాడ బయల్దేరారు. అయితే చంద్రబాబును కలిసేందుకు కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి వుందని పోలీసులు స్పష్టం చేశారు. పవన్ వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులను విజయవాడ పోలీసులు కోరారు.
అంతకుముందు చంద్రబాబు అరెస్ట్ను పవన్ కల్యాణ్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపేనని పేర్కొన్నారు. చంద్రబాబుకు జనసేన మద్దతు ఉంటుందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ వీడియో విడుదల చేశారు. ఏ తప్పు చేయని ప్రతిపక్ష నాయకులను జైలులో పెట్టి వేధిస్తున్నారని అన్నారు. గతంలో విశాఖపట్నంలో జనసేన నాయకుల విషయంలో ఇలాగే వ్యవహరించారని పవన్ గుర్తుచేశారు.
Also Read: చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపే.. ఆయనకు మా మద్దతు ఉంటుంది: పవన్ కల్యాణ్ (వీడియో)
ప్రాథమిక ఆధారాలు చూపించకుండా అర్దరాత్రి అరెస్ట్ చేసే విధానాలను ఆంధ్రప్రదేశ్లో అవలంభిస్తున్నారు. గతేడాది అక్టోబర్లో విశాఖపట్నంలో జనసేన పట్ల పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారు. పాపం ఏ తప్పు చేయని జనసేన నాయకులను హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టారు. చంద్రబాబు మీద నంద్యాలలో జరిగిన సంఘట కూడా అలాంటిదే. చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడాన్ని సంపూర్ణంగా జనసేన ఖండిస్తోంది.
పాలనపరంగా చాలా అనుభవంతో ఉన్న వ్యక్తి పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందని అనిపిస్తుంది. ఈరోజు వైసీపీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పోలీసులు, వైసీపీ పార్టీ, ప్రభుత్వం సంసిద్దంగా ఉందని చెబుతున్నారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసులు అయితే.. మీ పార్టీకి సంబంధం ఏమిటి?. మీ పార్టీ వల్లే శాంతి భద్రతల సమస్య తలెత్తింది కదా. ఒక నాయకుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన మద్దతుదారులు, పార్టీ నాయకులు, అనుచరులు ముందుకు రావడం కచ్చితంగా జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో భాగం. వారు ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటే ఎలా?