అప్పన్న దేవాలయం.. వెండి దొంగలు దొరికారు..!
ఈ విధంగా మొత్తం 34 గోనె సంచులలో వెండి వస్తువులను దేవస్థానం దిగువ భాగంలో ఉన్న కొంతమంది వ్యాపారులకు విక్రయించారు. మరోవైపు 473 కేజీల వెండిని కరిగించి దిమ్మలు గా మార్చి వేశారు.
విశాఖపట్నం జిల్లాలోని సింహాద్రి అప్పన్న దేవస్థానంలో అపహరణకు గురైన వెండి వస్తువులను పోలీసులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 550 కిలోల వెండి చోరీ వెనుక దేవస్థానం లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది హస్తం ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి డిసిపి క్రైమ్ సురేష్ బాబు బుధవారం సాయంత్రం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన మూడు నెలల కాలంలో లాక్ డౌన్ పీరియడ్ ను ఆసరాగా చేసుకున్న నిందితులు ఈ చోరీకి పాల్పడ్డారని తెలిపారు. నిందితులు అంతా పారిశుద్ధ్య కార్మికులు కావడంతో.. ప్రతిరోజు చెత్త తో పాటు కొన్ని వెండి వస్తువులను గోని సంచిలో వేసుకొని దేవస్థానం దిగువకు తరలించారు.
ఈ విధంగా మొత్తం 34 గోనె సంచులలో వెండి వస్తువులను దేవస్థానం దిగువ భాగంలో ఉన్న కొంతమంది వ్యాపారులకు విక్రయించారు. మరోవైపు 473 కేజీల వెండిని కరిగించి దిమ్మలు గా మార్చి వేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. సింహాద్రి అప్పన్న కు కానుకల రూపంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలను హుండీలో వేస్తుంటారు. ఈ ఈ విధంగా స్వామివారికి సమకూరిన వెండి ఆభరణాలను.. ఆగస్టు 10వ తేదీన ఒక కాంట్రాక్టర్ వేలం పాడుకున్నారు. నిర్ణీత రుసుము చెల్లించి వెండిని నలభై ఒక్క గోనె సంచులలో ప్యాక్ చేశారు.
మొత్తం అన్ని గోనె సంచులను దేవస్థానం కళ్యాణ మండపం లో భద్రపరిచారు. ఈ నెల 10వ తేదీన ఆ వెండి వస్తువులను తీసుకెళ్లేందుకు కాంట్రాక్టర్ వచ్చేసరికి చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సింహాచలం దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పులి రామారావు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసును దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టయిన వారిలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న సురేష్,, కాశి మహేష్, సోమల శ్రీనివాస్, సోమ సతీష్ ఉన్నారు. కాగా వెండిని కొనుగోలు చేసిన పిండరాల అప్పారావు, వడ్డే రాము, మాడెం రాజశేఖర్, ఆవుల వెంకట కుమార్ రెడ్డి ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా చోరీ అయిన సొత్తు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి పోలీస్ కమిషనర్ సంతకం చేసిన ప్రశంసా పత్రాలను క్రైమ్ డిసిపి అందజేశారు.