దిగొచ్చిన పోలీసులు: ఆంక్షలతో జగన్ పాదయాత్రకు అనుమతి
గోదావరి నది వంతెనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
రాజమండ్రి: గోదావరి నది వంతెనపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు రాజమండ్రి డిఎస్పీ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు ఓ లేఖ రాశారు.
బ్రిడ్జీ కండీషన్ బాగా లేదని, వంతెన బలహీనంగా ఉన్నందున ఎక్కువ మంది వస్తే నిలబడలేదని అంటూ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. రాజమండ్రిలో వైఎస్ జగన్ బహిరంగ సభకు కూడా అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.
పాదయాత్రకు వేరే మార్గం చూసుకోవాలని డిఎస్పీ వైఎస్సార్ కాంగ్రెసు నేతలకు సూచించారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెసు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ వేలాది వాహనాలు వెళ్తాయని, అప్పుడు లేని ప్రమాదం పాదయాత్ర వల్లనే ఉంటుందా అని వారంటున్నారు.
ఒకేసారి అందరూ కాకుండా విడతలు విడతలుగా వంతెనపై నుంచి ప్రజలను అనుమతించడం వంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూడకుండా పాదయాత్రకు నిరాకరించడం సరికాదని, జగన్ పాదయాత్ర ప్రాధాన్యాన్ని తగ్గించడానికే ఆ పనిచేస్తన్నారని వారంటున్నారు.
గోదావరి నది వంతెనపై జగన్ పాదయాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు రాజమండ్రి రూరల్ ఎస్పీ రాజకుమారిని కలిశారు. పోలీసుల నిబంధనలకు లోబడి పాదయాత్ర చేయాలని ఆమె సూచించారు.
బ్రిడ్జి కమ్ రోడ్డుపై పాదయాత్రకు అనుమతించారు. బ్రిడ్జి రెయిలింగ్ బలహీనంగా ఉందని ఆమె చెప్పారు. పార్టీ వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు.