రంజాన్ ఎఫెక్ట్: పవన్ కల్యాణ్ యాత్రకు విరామం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు.
విశాఖపట్నం: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజా పోరాట యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. తన వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది ముస్లింలు ఉండడం వల్ల రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ విరామం ఇచ్చారు.
రంజాన్ తర్వాత ఆయన యాత్ర విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుంది. శుక్రవారం రాత్రి ఎలమంచిలి సభను ముగించుకుని విశాఖపట్నం చేరుకున్న పవన్ భీమిలి బీచ్రోడ్డులోని సాయిప్రియ రిసార్ట్లో బస చేశారు.
శనివారం ఉదయం విశాఖకు చెందిన కొంతమంది మేధావులతో ఆయన సమావేశమయ్యారు. మాజీ వైస్ చాన్సలర్ కేఎస్ చలం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఆది, సోమవారాలలో వివిధ వర్గాలవారితో పవన్ చర్చించనున్నారని జనసేన మీడియా అధిపతి పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
తమ పార్టీ కార్యకర్తలకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై అవగాహన కల్పించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం సాయంత్రం పవన్ విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరుతారు.