రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు: పవన్ కల్యాణ్
రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మోసం చేశారా? అవునని అంటున్నారు పవన్ కల్యాణ్. స్వయంగా ఆయనే ఆ విషయం చెప్పారు.
అమరావతి: రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మోసం చేశారా? అవునని అంటున్నారు పవన్ కల్యాణ్. స్వయంగా ఆయనే ఆ విషయం చెప్పారు.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తే రాజ్యసభ సీటు ఇస్తానని ఆశ పెట్టి చంద్రబాబు తనను మోసం చేశారని పవన్కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.
గత ఎన్నికలకు ముందు తాను 2012లో రాజకీయాలపై మాట్లాడేందుకు చంద్రబాబును కలిసినట్టు తెలిపారు. అప్పుడే రాజకీయ పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో 60–70 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబుకు తాను చెప్పానని అన్నారు.
మీరు పార్టీపెట్టి విడిగా పోటీచేస్తే ఓట్లు చీలిపోతాయని, ఆ ఆలోచన చేయవద్దని చంద్రబాబు అప్పట్లో తనకు సూచించారని అన్నారు. తనకు రాజ్యసభ సీటు ఇస్తానని కూడా చెప్పారని, మరుసటి రోజు అదే విషయాన్ని రెండు పత్రికల్లో రాయించారని తప్పుపట్టారు.
అప్పడే చంద్రబాబుపైనా, టీడీపీపైనా నమ్మకం పోయిందన్నారు. ఆ పార్టీకి దండం పెట్టి ఆ తర్వాత బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీని కలిసినట్టు చెప్పారు. అప్పట్లో తాను 60–70 సీట్లలో పోటీచేసి ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం తనకు ఉండేదని అన్నారు.