నన్ను సీఎంగా చూడాలని ఉందా..?

‘నన్ను సీఎంగా చూడాలని మీరు అనుకుంటే.. ముందు నాకు మీ సమస్యలు ఏంటో తెలియాలి’ అని అంటున్నారు జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్. శుక్రవారం ఆయన విశాఖ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడారు. ప్రజలు అనుమతిస్తే తాను బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. మీరు సీఎం అని నినిదాలు చేసినంత మాత్రనా తాను ముఖ్యమంత్రిని అయిపోనని ఆయన ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి కానీ.. నేతల స్వార్థ ప్రయోజనాల కోసం కాదన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడం సరికాదన్నారు. టీడీపీ, బీజేపీ లు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లే తాను ప్రజల్లోకి రావాల్సి వచ్చిందన్నారు. మీ చేత తిట్లు తినడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. 

ప్రజా సమస్యలను అడిగి మరీ ఈ సందర్భంగా ఆయన తెలుసుకున్నారు. సభకు వచ్చిన అందరి కుటుంబసభ్యుడిగా మాత్రమే తాను ఇక్కడికి వచ్చినట్లు ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓ నటుడిగా అందరికీ తెలుసునని.. కానీ తన దగ్గర ఎలాంటి అధికారం లేదని చెప్పుకొచ్చారు. అధికారంలేని వాళ్లు కేవలం సమస్యల గురించి మాట్లాడగలడని, ఏమేమి సమస్యలు ఉన్నాయో మాత్రం చెప్పగలడన్నారు.

ప్రజల సమస్యల గురించి పదేపదే మాట్లాడి.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. తద్వారా ప్రజల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. తాను రాష్ట్రమంతా తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకుంటానని ఆయన వివరించారు.