ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప సంచలన అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప సంచలన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను బిజెపి మార్చేసిందనే అనుమానం ఉందని, పవన్ కల్యాణ్ భవిష్యత్తులో టీడీపితో కలిసే అవకాశాలు లేకపోలేదని ఆయన అన్నారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె కార్యక్రమంలో ఆయన ఆ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పవన్ కల్యాణ్ లో పట్టుదల, స్థిరత్వం లేవని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఆయన భవిష్యత్తులో తెలుగుదేశంతో కలిసే అవకాశాలు లేకపోలేదని చినరాజప్ప అన్నారు. 

బిజెపి శాసనసభ్యుడు విష్ణుకుమార్ రాజు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే మాట వినిపిస్తోందని అన్నారు. అందుకే టీడీపిపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విష్ణుకుమార్ రాజు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఈ రోజు తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానని, హోంశాఖను నిర్వహిస్తున్నానని, రేపు పొద్దున పదవి వద్దు.. పార్టీ కోసం పనిచేయి అని చంద్రబాబు చెప్తే సంతోషంగా చేస్తానని, ఏ మాత్రం వ్యతిరేకించనని అన్నారు. 

మంత్రి పదవి చేపట్టిన తర్వాత తాను మారిపోయాననే ప్రచారంలో నిజం లేదని అన్నారు. మందకృష్ణ మాదిగను, ముద్రగడ పద్మనాభాన్ని, బీసీ నాయకులను, ఇతర కులాలవారిని రెచ్చగొడుతూ, పోరాటాలు చేస్తే డబ్బులు ఇస్తానని ఆశ పెట్టి వైఎస్ జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంట్లో కూర్చుని విమర్శలు చేస్తూ, రోజుకో లేఖ రాసే ముద్రగడ వంటివారిని కాపులు నమ్మే స్థితిలో లేరని అన్నారు.