అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తాం.. రాజకీయంగా ఎదుర్కొలేకే కులం రంగు పులుముతున్నారు: పవన్ కల్యాణ్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన పవన్ కల్యాణ్.. రాజకీయపరంగా తనను ఎదుర్కోలేకనే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు.
జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడిన పవన్ కల్యాణ్.. రాజకీయపరంగా తనను ఎదుర్కోలేకనే కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గురించి, యువతకు ఉపాధి కోసం ప్రశ్నిస్తే.. సీఎం జగన్ తనకు కులం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. కులం చూసుకుని రాజకీయం చేస్తే గత ఎన్నికల్లో తనకు 40 సీట్లు వచ్చేవని అన్నారు. ఓట్ల కోసం మత రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలని అన్నారు. మసీదు, చర్చికి అపవిత్రం జరిగితే ఏ విధంగా ఖండిస్తామో ఆలయాలకు అపవిత్రం జరిగినా బలంగా ఖండిస్తేనే సెక్యులరిజమని పవన్ చెప్పారు.
ఢిల్లీకి వెళ్లి వైసీపీ ఎంపీలు ఏం చేస్తారో తనకు తెలుసని అన్నారు. వీరి అధికారం సామాన్యులను చావగొట్టడానికి తప్ప.. ప్రధాని ముందు నోరు మెదపరని అన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవని అన్నారు. ఉన్న వ్యవస్థలను బలోపేతం చేస్తే చాలా పనులు జరుగుతాయని అన్నారు. భీమ్లా నాయక్ సినిమా ఆపడానికి ఎమ్మార్వో నుంచి చీఫ్ సెక్రెటరీ దాకా అందరూ పనిచేశారని విమర్శించారు. విధ్వంసం కోసం వ్యవస్థలను వాడేవాళ్లు.. దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వడానికి, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎందుకు వాడరని ప్రశ్నించారు.
వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసి అభివృద్ధి అంటోందని.. రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని.. వైసీపీ నేతలకు కాదని అన్నారు. ప్రభుత్వం ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతుందని మండిపడ్డారు. బరి తెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు.