నేనేమీ సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు.. పవన్
రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ పవన్
సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా ప్రస్తుతం పవన్.. విశాఖపట్నం మన్యంలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగానే గురువారం ఆయన పాడేరులో రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకొచ్చేందుకే వచ్చానన్నారు. డిగ్రీలు పూర్తి చేసుకున్న యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకపోవడంవల్లే పక్కదారి పడుతున్నారని అన్నారు.
ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూపకపోవడం దారుణమన్నారు. హుకుంపేట మండలం గూడలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలతో కడుపు మండే జనసేన పార్టీ ఆవిర్భవించిందని వ్యాఖ్యానించారు. పాడేరులో రోడ్షో ముగించుకున్న అనంతరం పవన్ మాడుగులకు బయల్దేరారు.