‘పాయకరావుపేట సీటు.. జనసేన ఖాతాలో’
ప్రజా పోరాట యాత్రలో పవన్
ఈ నాలుగేళ్లలో చంద్రబాబు తన కుమారుడు లోకేష్ కి తప్ప మరెవ్వరికీ ఉద్యోగం కల్పించలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ప్రస్తుతం విశాఖ జిల్లా మన్యంలో పర్యటిస్తున్న ఆయన పాయకరావుపేట లో ఈరోజు బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ... 2019లో పాయకరావుపేట సీటు జనసేన ఖాతాలో పడటం ఖాయమన్నారు.
గురజాడ పుట్టిన గడ్డపై డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం దారణమన్నారు. 30 పడకల ఆస్పత్రిని 60పడకల ఆస్పత్రిగా చేస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటి వరకు దానిని ఆచరణలో పెట్టలేదని మండిపడ్డారు. తాండవ నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వేస్తున్నారన్నారు. అల్లూరి సీతారామరాజు తిరిగిన నేల ఇదని ఆయన అన్నారు. కళింగాంధ్రను కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలు.. రాష్ట్రాన్ని దోచేస్తున్నాయని మండిపడ్డారు.
వేల ఎకరాలు దోపిడి చేస్తున్నారు కానీ.. ఏ ఒక్కరికీ కనీసం ఉద్యోగం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం లోకేష్ కి మాత్రమే ఉద్యోగం దక్కిందని ఆరోపించారు. ఫ్లెక్సీలు కడుతూ చనిపోయిన ఇద్దరు కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చనిపోయిన కార్యకర్తల పిల్లల చదువులు కూడా పార్టీనే చూసుకుంటుందన్నారు.