చింతమనేని హత్యకు సుపారీనా ?
చింతమనేనిని హత్య చేసేందుకు కొందరు ప్లాన్ చేసారు. అదికూడా ఎవరో కాదు టిడిపి నేతే కావటంతో పార్టీలో సంచలనంగా మారింది. ఏలూరు మాజీ ఎంపిపి అనురాధ భర్త రెడ్డి అప్పలనాయుడే ఎంఎల్ఏ హత్యకు సుపారి ఇచ్చినట్లు వెల్లడైంది.
తెలుగుదేశంపార్టీ నేతల మధ్య గొడవలు విభేదాలు దాటి హత్యా రాజకీయాలకు చేరుకుంటోంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో బయబపడిన ఘటన పార్టీలో కలకలం రేపుతోంది. దెందులూరు ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ అత్యంత వివాదాస్పద నేతల్లో ఒకరు. ఆయనంటే పార్టీలోని వారికే చాలామందికి పడదు. ఎందుకంటే, అదృష్టం కొద్ది ఎంఎల్ఏగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. జిల్లాలో చింతమనేనిపై అనేక కేసులున్నాయి. గతంలో రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసారు. దాన్ని బట్టే చింతమనేని నేపధ్యం ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
అటువంటి చింతమనేనిని హత్య చేసేందుకు కొందరు ప్లాన్ చేసారు. అదికూడా ఎవరో కాదు టిడిపి నేతే కావటంతో పార్టీలో సంచలనంగా మారింది. ఏలూరు మాజీ ఎంపిపి అనురాధ భర్త రెడ్డి అప్పలనాయుడే ఎంఎల్ఏ హత్యకు సుపారి ఇచ్చినట్లు వెల్లడైంది. కొద్ది రోజులుగా గుర్తు తెలీని వ్యక్తులు తనను వెంబడిస్తున్నట్లు ఎంఎల్ఏ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇటీవలే ఓ యువకుడిని పట్టుకున్నారు. దాంతో విషయం బయటకు వచ్చింది.
ఏలూరు మండలం ఎంపిపిగా ఉన్న రెడ్డి అనూరాధ చేత చింతమనేని బలవంతంగా రాజీనామా చేయించారట. అంతేకాకుండా ఆమె స్ధానంలో తన మద్దతుదారైన హైమవతిని ఎంపిపిగా కూర్చోబెట్టారట. దానికి తోడు ఎప్పటి నుండో చింతమనేని, అప్పలనాయుడుకు పడదు. ఎంపిపికి రాజీనామ చేయించిన ఘటనతో పాత కక్షలు భగ్గుమన్నాయి. దాంతో అప్పలనాయుడు సుపారి ఇచ్చి హత్యలకు బేరం కుదుర్చుకున్నారట. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో వెలుగు చూసాయి. దాంతో అప్పలనాయుడుతో పాటు మరో 8 మందిని పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. దాంతో అప్పలనాయడు వర్గం చింతమనేనిపై భగ్గుమంటోంది. మరి, ఈ విభేదాలు ఎందాకా వెళతాయో చూడాలి.