రాజధాని తరలింపును అడ్డుకునే ప్రయత్నం...హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు
ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి చర్యలను అడ్డుకోవాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రయత్నిస్తోంది.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో తదుపరి చర్యలను అడ్డుకోవాలని రాజధాని రైతు పరిరక్షణ సమితి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే గెజిట్ ను నిలిపివేయాలంటూ హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు.
పాలన వికేంద్రీకరణ, సిఆర్డీఏ రద్దు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలుచేశారు. జీఎన్ రావు, హైపవర్ కమిటీ చట్ట విరుద్ధమని ప్రకటించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. రాజభవన్, సీఎం కార్యాలయం, సచివాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్ట్ రేపు(మంగళవారం) విచారణ జరుపనుంది.
విశాఖపై పోలీస్ ఫోకస్: సీపీ చైర్మన్ గా 8మందితో కమిటీ ఏర్పాటు
సీఆర్డీఏ, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గత శుక్రవారం ఆమోదం తెలిపారు. మూడు వారాల క్రితం ఈ రెండు బిల్లులను ఏపీ ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.
అధికారంలోకి వచ్చి తర్వాత ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగానే సీఎం జగన్ ప్రకటించారు.
ఈ రెండు బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఏడాది జూన్ మాసంలో శాసనమండలి వాయిదా పడింది. జూన్ కంటే ముందు జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఈ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపాలని సూచించింది.
అయితే సెలెక్ట్ కమిటి ఏర్పాటు కాలేదు. సెలెక్ట్ కమిటిని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేశారు. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను టీడీపీ, బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జూన్ మాసంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన మరోసారి ఈ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. శాసనమండలికి పంపారు. ఈ బిల్లులపై ఎలాంటి చర్చ జరగకుండానే మండలి వాయిదా పడింది.
శాసనమండలి వాయిదా పడిన నెల రోజుల తర్వాత ఈ బిల్లులను ఆమోదం కోసం గవర్నర్ కు ప్రభుత్వం పంపింది. ఈ బిల్లులను ఆమోదించకుండా ఉండాలని విపక్షం లేఖలు రాసింది. యనమల రామకృష్ణుడు, చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశాడు.ఈ రెండు బిల్లుల విషయంలో న్యాయ సలహా తీసుకొన్న తర్వాత గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు.