నిరుపేద కుటుంబాలకు మరో అవకాశం...: మంత్రి అంజాద్ బాష ప్రకటన
నవశకం కార్యక్రమం ద్వారా ఇదివరకు తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించబడిన లబ్ధిదారులు మరో అవకాశాన్ని కల్పించింది ఏపీ ప్రభుత్వం.
అమరావతి: అర్హత కలిగివున్నా తిరస్కరించబడిన బియ్యంకార్డు దరఖాస్తుదారులు తిరిగి కొత్త కార్డు పొందేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష తెలిపారు. నవశకం కార్యక్రమం ద్వారా ఇదివరకు తెల్ల రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోగా తిరస్కరించబడిన లబ్ధిదారులు మరలా తెల్ల రేషన్ కార్డు పొందేందుకు వాస్తవిక ఆధారములతో దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వము మరో అవకాశము కల్పించిందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగి, మోటార్ కారు కలిగిన వారు, ఆదాయపన్ను దారులు, పరిమితికి మించి సొంత భూమి కలిగిన వారు, అత్యధిక యూనిట్లలో విద్యుత్ ఉపయోగించినవారు, బహుళ బంధుత్వాలు ( పెళ్లి అయిన వారు, తొలగింపు / నమోదు) కారణాల వలన తెల్ల రేషన్ కార్డుకు అనర్హులైన లబ్ధిదారులు సహేతుక ఆధారాలు సమర్పించి తిరిగి తెల్ల రేషన్ కార్డు పొందవచ్చని వెల్లడించారు. తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు ఇదివరకు అనర్హత కలిగిన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, సదరు కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును రేషన్ కార్డు దరఖాస్తుతో జతచేసి తమ సమీపంలోని గ్రామ-వార్డు సచివాలయాల్లో సమర్పించాలని సూచించారు.
ఆ మేరకు, సంబంధిత గ్రామా-వార్డ్ సచివాలయ సిబ్బందిచే ఆరు దశల మూల్యాంకనం ద్వారా ఇదివరకు అనర్హత పొందిన వారు మరల తెల్ల రేషన్ కార్డుకు అర్హత పొందే అవకాశాలు ఉన్నాయి. కావున, ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి అంజాద్ బాషా తెలిపారు.