తెలంగాణలో ఓటేసి ఏపీలో వేస్తామంటే కుదరదు.. వారిపై క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్
తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉండటం నేరం అని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సీఈసీ రాజీవ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసి ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో ఓటు వేస్తామని దరఖాస్తు చేసుకుంటారా? అని ప్రశ్నించారు. ఎక్కడ నివాసం ఉంటున్నారో అక్కడే ఓటు హక్కు తీసుకోవాలని వివరించారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు నేపథ్యంలో సీఈసీ రాజీవ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, అందులో 2.07 కోట్ల మంది మహిళలు, 1.99 కోట్ల మంది పురుషులు అని వివరించారు. 7.88 లక్షల మంది కొత్తగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 22వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదలవుతుందని వివరించారు.
గతంలో అక్రమంగా తొలగింపునకు గురైన సుమారు 13 వేల ఓట్లను పునరుద్ధరించామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని కీలక విషయాలు ప్రస్తావించారు. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉండటం నేరం అని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వారు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయరాదని స్పష్టం చేశారు. రెండు చోట్లా ఓటు హక్కు ఉంటే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Top Stories: ఉచిత విద్యుత్ కోసం సీఎం ఆదేశాలు, అయోధ్యకు కాంగ్రెస్ డుమ్మా, చలాన్ల గడువు పొడిగింపు
ఎవరికైనా ఓటు హక్కు ఒక్క చోటునే ఉంటుందని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు హక్కు ఉంటుందని వివరించారు. నివాసులై ఉంటున్న చోటే ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. రెండు చోట్లా ఓటు హక్కు ఉంటే మాత్రం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, వారిపై కేసు నమోదు అవుతుందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన వారు ఇక్కడ ఓటుకు ఎలా దరఖాస్తు చేస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉన్న వారికి ఓటు ఇవ్వలేం అని స్పష్టం చేశారు.