అమిత్షా, రామ్మాధవ్లను కలవలేదు, ఆ బిజెపి ఎమ్మెల్యేతో లంచ్ చేశా: బుగ్గన
యనమల, లోకేష్ కు కౌంటరిచ్చిన బుగ్గన
అమరావతి: రహస్యంగా తాను బిజెపి నేతలను కలవాల్సిన అవసరం లేదని పీఎసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రప్రసాద్ రెడ్డి చెప్పారు. న్యూఢిల్లీలో బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి లంచ్ చేసిన విషయం వాస్తవమేనని ఆయన చెప్పారు.
శుక్రవారం నాడు వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా , బిజెపి ఏపీ రాష్ట్ర ఇంచార్జీ రామ్ మాధవ్ ను తాను కలిసినట్టుగా టిడిపి నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏపీ మంత్రులు లోకేష్, యనమల రామకృష్ణుడులు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
అర్ధరాత్రి దొంగచాటుగా తాను బిజెపి నేతలను కలవాల్సిన అవసరం తనకు లేదన్నారు. పీఎసీ నివేదికను బిజెపి నేతలకు ఇవ్వాల్సిన అవసరం తనకు లేతన్నారు.పీఏసీ నివేదికను బిజెపి నేతలకు ఇవ్వాలని భావిస్తే ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్ రాజు లకు ఏపీలోనే ఇచ్చేవాడినని ఆయన చెప్పారు.
కాగ్ నివేదిక ఆన్లైన్లోనే ఉంటుందన్నారు.ఒక్కసారి తాను ఢిల్లీకి వెళ్తేనే టిడిపి నేతలు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. నిజంగానే తాము బిజెపి నేతలను కలిస్తే వారి గుండెలు జారిపోతాయని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇతర పార్టీల్లో ఉన్న నేతలను కలిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. ఇతర పార్టీల్లో ఉంటే వారితో మాట్లాడకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ కే పరిమితమయ్యారని ఆయన చెప్పారు. మైక్ ముందుకు వచ్చి మాట్లాడితే నోరు జారుతారనే భయం లోకేష్ కు ఉందన్నారు.
టిడిపి నేతలు చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు. తాను బిజెపి నేతలను కలుసుకోలేదన్నారు. ఎవరికీ ఎలాంటి నివేదికలను కూడ ఇవ్వలేదన్నారు. ఏ నివేదికలను తాను ఇచ్చానో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.