సుదీర్ఘ కాలం తర్వాత ఎదురుపడిన బాబు, పవన్, మాటల్లేవ్


గుంటూరు: చాలా కాలం తర్వాత ఎదురుపడిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు కనీసం పలకరించుకోలేదు. పక్క పక్కనే నిలబడ్డా కూడ మాట్లాడుకోలేదు. ఇటీవల కాలంలో ఒకరిపై మరోకరు విమర్శలు గుప్పించుకొంటున్న విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred


గుంటూరు జిల్లాలోని నంబూరులో దశావతార వెంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శుక్రవారం నాడు అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు పాల్గొన్నారు. వెంకటేశ్వరస్వామివారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు ఇద్దరు పక్కనే పక్కనే నిలబడ్డారు. కనీసం పలకరించుకోలేదు. చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యల విషయమై ఏపీ సీఎం చంద్రబాబునాయుడును పవన్ కళ్యాణ్ కలిశారు. అమరావతిలో సీఎంను కలిసి ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలపై చర్చించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో కలవడం ఇదే మొదటిసారి.

గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశం వేదికగా టిడిపిపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. అప్పటి నుండి చంద్రబాబుతో సహ, టిడిపి నేతలపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పిస్తున్నారు. తన యాత్రలో భాగంగా కూడ టిడిపి నేతలపై పవన్ విమర్శలు చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ విమర్శలకు టిడిపి కూడ ఘాటుగానే సమాధానమిస్తోంది. పవన్ కళ్యాణ్ యూ టర్న్ ఎందుకంటూ ప్రశ్నిస్తోంది. వైసీపీ, జనసేన, బిజెపిలు కుమ్మక్కయ్యారని టిడిపి నేతలు విమర్శలు చేస్తున్నారు. 

అయితే ఈ విమర్శల పరంపర కొనసాగుతున్న సమయంలోనే ఇవాళ ఇద్దరూ కూడ ఒకే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇద్దరూ కనీసం మర్యాదపూర్వకంగా కూడ మాట్లాడుకోలేదు. గతంలో పవన్ కళ్యాణ్ సచివాలయానికి వస్తే చంద్రబాబునాయుడు పవన్ కారు వరకు వచ్చి సాగనంపిన సందర్భాలు కూడ లేకపోలేదు. కానీ, వారిద్దరూ కనీసం మాటవరుసకు కూడ ఈ కార్యక్రమంలో పలుకరించుకోకపోవడం గమనార్హం.