పవన్ కళ్యాణ్ తిరుమల టూర్ లో కొత్త ట్విస్ట్
ఏం జరుగుతుందో తెలుసా ?
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ సామాన్య భక్తుల మాదిరిగా క్యూలైన్లో దర్శనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ఆయన తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత వెంటనే బస్సుయాత్రకు బయలుదేరుతారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు మరో రెండు రోజులపాటు పవన్ తిరుమలగిరులలోనే ఉండే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఆదివారం ఉదయం 10 గంటలకు సామాన్య భక్తులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తమతో పాటే దర్శనానికి వచ్చిన పవన్ కల్యాణ్ ను చూసి సంతోషం వ్యక్తం చేశారు భక్తులు. సామాన్య భక్తులతో కలసి స్వామివారిని దర్శనం చేసుకోవడం తనకు ఎంతో తృప్తి నిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. అయితే ఆదివారం రోజంతా పవన్ ధ్యానంలో గడపనున్నట్లు చెబుతున్నారు. సోమవారం కొండపై ఉన్న కొన్ని క్షేత్రాలను సందర్శించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శ్రీవారి క్షేత్రంలో ఉన్న యోగ నరసింహస్వామి సన్నిధిలో తనకు అన్నప్రాసన జరిపినట్లు తన తల్లిదండ్రులు తరచు గుర్తు చేసేవారని సన్నిహితులకు పవన్ కల్యాణ్ చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ప్రజలకు శక్తి వంచన లేకుండా సేవచేసే భాగ్యాన్ని ప్రసాదించమని శ్రీ వెంకటేశ్వరుని ప్రార్ధించినట్లు తన సన్నిహితులతో పవన్ కల్యాణ్ చెప్పారు.