ఏపీలో కొత్త ట్రాఫిక్ జరిమానాలు ఇవిగో...
ఈ నూతన జరిమానాలవల్ల సామాన్యులు అధికంగా ఇబ్బందిపడుతున్నారని గ్రహించిన అధికారుల బృందం జరిమానాలు తగ్గించాలని నిర్ణయించింది. బాగా కసరత్తులు చేసిన ఈ బృందం తమ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇచ్చినట్టు సమాచారం.
అమరావతి: కేంద్రం నూతన మోటారు వాహన చట్టంలో జరిమానా రేట్లను భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ జరిమానాలు కట్టలేక దేశం మొత్తం గగ్గోలు పెడుతున్న విషయం మనందరం టీవీల్లో చూస్తూనే ఉన్నాం. ఒకరు బండి రోడ్డు మీద వదిలేసి నిరసన తెలిపితే మరొకరు ఏకంగా బండికి నిప్పంటించి నిరసన తెలిపారు. ఏదిఏమైనా ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతున్నారనే మాట మాత్రం వాస్తవం.
ఈ ట్రాఫిక్ నిబంధనలను అమలుపరిచేకంటే ముందు ఈ నిబంధనల గురించి, జరిమానాల గురించి తొలుత ప్రజల్లో అవగాహన తీసుకురావాలని భావించింది జగన్ సర్కార్. అందుకోసమే ఈ నూతన జరిమానాలు అమలు చేయకుండా అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఇదే సమయంలో ఈ నూతన జరిమానాలు చాలా భారీ స్థాయిలో ఉన్నాయని, వీటిపైన సమగ్రమైన అధ్యయనం జరిపి ఆమోదయోగ్యమైన జరిమానాలు సూచించాలని అధికారులను జగన్ ఆదేశించాడు. ముఖ్యమంత్రిగారి ఆదేశాలను అందుకున్న అధికారులు వెంటనే రంగంలోకి దిగి తొలుత దేశ వ్యాప్తంగా ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకున్నారు.
ఈ నూతన జరిమానాలవల్ల సామాన్యులు అధికంగా ఇబ్బందిపడుతున్నారని గ్రహించిన అధికారుల బృందం జరిమానాలు తగ్గించాలని నిర్ణయించింది. బాగా కసరత్తులు చేసిన ఈ బృందం తమ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో అమలుచేయాలని యోచిస్తున్న ట్రాఫిక్ ఫైన్లను మీరు ఒకసారి చూడండి.
రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే - 250 (కేంద్రం 500)
లైసెన్సు లేకుండా బండి నడిపితే - 2500 (కేంద్రం 5000)
అర్హత లేకుండా వాహనం నడిపితే - 4 వేలు (కేంద్రం 10వేలు)
ఓవర్ లోడింగ్ - 750 (కేంద్రం 2వేలు)
డ్రంకెన్ డ్రైవ్ - 5వేలు (కేంద్రం 10వేలు)
ఇన్సూరెన్స్ లేకపోతే - 1250 (కేంద్రం 2వేలు)
సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే - 500 (కేంద్రం 1000)