వైసిపి పాలకుల వక్రబుద్దిని చక్కదిద్దు వక్రతుండా...: వినాయకున్ని కోరుకున్న లోకేష్
వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి లోకేష్ పాలకులకు మంచి బుద్దిని ప్రసాదించాలని వక్రతుండిన్ని కోరుకున్నారు.
మంగళగిరి: వైసిపి పాలకులపై వ్యంగాస్త్రాలు విసురుతూనే మరోవైపు రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్ర పాలకుల వక్రబుద్దిని చక్కదిద్ది మంచి బుద్దిని ప్రసాదించాలని వినాయకున్ని కోరుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు.
''వినాయకుడిని సిద్ధి, బుద్ధి ప్రదాత అంటారు. అప్పులు, తప్పులు చేసి రాష్ట్ర ప్రజలను తిప్పలు పెడుతున్న మన పాలకులకు ఆ గణేశుడు మంచి బుద్ధిని ప్రసాదించాలి. ప్రజల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పాలకుల వక్రబుద్ధిని ఆ వక్రతుండుడు చక్కదిద్దాలి'' అని కోరుకుంటున్నట్లు లోకేష్ తెలిపారు.
''విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంతో, ఆరోగ్యాలతో తులతూగాలని కోరుకుంటూ మీ ఇంటిల్లిపాదికీ వినాయక చవితి శుభాకాంక్షలు'' అంటూ వినాయక చవితి సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.
READ MORE వినాయక చవితి రోజున పూజ
అంతకుముందు వినాయక చవితి ఉత్సవాలపై వైసిపి ప్రభుత్వం ఆంక్షలు విధించడంపైనా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''మీ నాన్న గారి జయంతి-వర్ధంతి, మీ వివాహ వార్షిక వేడుకలు, వైకాపా నాయకుల వ్యక్తిగత కార్యక్రమాలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు ఒక్క వినాయక చవితికి మాత్రమే ఎందుకు అడ్డొచ్చాయి జగన్ రెడ్డి గారు?'' అని ప్రశ్నించారు.
''కడప జిల్లా ప్రొద్దుటూరులో కనీస కోవిడ్ నిబంధనలు పాటించకుండా స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సలహాదారుడు సజ్జల రామక్రుష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ అవినాష్ రెడ్డి కూడా హాజరయ్యారు. మీరంతా కోవిడియట్స్ లా వ్యవహరిస్తూ, సూపర్ స్ప్రెడర్లుగా విచ్చలవిడిగా తిరుగుతుంటే కరోనా వ్యాపించదా? వినాయకచవితి జరుపుకుంటేనే కోవిడ్ కోరలు చాస్తుందా?'' అంటూ లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.