జగన్ రెడ్డీ... నీ జేసిబి ఊపులకు భయపడేవాడు ఎవడూ లేడు: లోకేష్ సీరియస్
ప్రస్తుత కరోనా కష్ట సమయంలో ప్రజల ప్రాణాలు గాలికొదిలేసిన జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతలు భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు అంటూ నారా లోకేష్ మండిపడ్డారు.
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జీవీఎంసీ) అధికారులు కూల్చివేయడంపై మాజీ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ప్రస్తుత కరోనా కష్ట సమయంలో ప్రజల ప్రాణాలు గాలికొదిలేసిన జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతలు భవనాలు కూల్చే పనిలో బిజీగా ఉన్నారు అంటూ మండిపడ్డారు.
''విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి కార్మికుల పక్షాన నిలిచినందుకే టిడిపి నేత పల్లా శ్రీనివాస్ పై కక్షతో చర్యలకు దిగారు జగన్ రెడ్డి. విశాఖ ఉక్కుని తుక్కు రేటుకి కొట్టేయాలని ప్లాన్ చేసిన జగన్ రెడ్డికి అడ్డొచ్చారు అనే అక్కసుతోనే ఆదివారం పూట పల్లా ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు. అందుకే ఈ వైకాపా ప్రభుత్వాన్ని జేసీబి ప్రభుత్వం అన్నది'' అంటూ ఎద్దేవా చేశారు.
''కనీసం నోటీసు ఇవ్వకుండా, చట్టాన్ని తుంగలో తొక్కి యుద్ధ వాతవరణంలో భవనాన్ని కూల్చివేయ్యడాన్ని, కక్షసాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ జేసిబి ఊపులకు భయపడే వాడు ఎవడూ లేడు జగన్ రెడ్డి. విశాఖ ఉక్కు ప్రైవేటికరణ కాకుండా ఉండటానికి టిడిపి దేనికైనా సిద్ధమే'' అని లోకేష్ హెచ్చరించారు.
read more విశాఖలో ఉద్రిక్తత... మరో టిడిపి మాజీ ఎమ్మెల్యే భవనం కూల్చివేత
ఇక వైసీపీ ప్రభుత్వం పాలనను గాలికొదిలి పనిదినాల్లో అక్రమాలు, సెలవు దినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి దొంగలు పడ్డట్టు కోర్టు సెలవు రోజుల్లోనే జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా టీడీపీ నేతల ఇల్లు, భవనాలు కూల్చివేస్తోందని ఆరోపించారు. విశాఖలో టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
''కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా తెల్లవారుజామున దొంగల్లా వచ్చి భవనాన్ని కూల్చడం దారుణం. విద్వేషం, విద్వంసం లేకుండా వైసిపికి ఉనికి లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్ పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం దుర్మార్గం. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రజా వేదిక మొదలు ప్రతిపక్ష నేతల ఇల్లు ఎన్ని కూల్చారో లెక్కేలేదు. రాష్ట్రాన్ని మనుషులు పాలిస్తున్నారా లేక రాక్షసులు పాలిస్తున్నారా? రోజురోజు కి వైకాపా రాక్షస సంస్కృతి శృతి మించుతోంది, అధికారం శాశ్వతం కాదు. తగిన మూల్యం చెల్లించక తప్పదు'' అని అచ్చెన్న కూడా సీఎం జగన్ ను హెచ్చరించారు.