విశాఖలో ఉద్రిక్తత... మరో టిడిపి మాజీ ఎమ్మెల్యే భవనం కూల్చివేత
ఎలాంటి అనుమతులు లేకుండా కాంప్లెక్స్ ను అక్రమంగా నిర్మించారంటూ పాత గాజువాక సెంటర్లో గల టిడిపి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని అధికారుల పడగొట్టారు.
విశాఖపట్నం: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన భవనాల కూల్చివేతల పరంపర కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన బహుళ అంతస్తుల భవనాన్ని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జీవీఎంసీ) అధికారులు కూల్చివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా కాంప్లెక్స్ ను అక్రమంగా నిర్మించారంటూ పాత గాజువాక సెంటర్లో గల పల్లాకు చెందిన భవనాన్ని అధికారులు పడగొట్టారు.
తన భవనం కూల్చివేతపై సమాచారం అందుకున్న అనుచరులతో కలిసి అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులను నిలదీశారు. అయితే ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినట్లు జివిఎంసి అధికారులు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో భారీగా మోహరించిన పోలీసులు పల్లాలో పాటు పల్లాతో పాటు టిడిపి శ్రేణులకు అక్కడినుండి పంపేశారు.
ఇదిలావుంటే ఇప్పటికే 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమించినట్లు ఆరోపిస్తూ హీరో బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీలో భవనాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. విశాఖ నగర శివారులోని రుషికొండ సమీపంలో పెద్ద యెత్తున గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకుందని అంటూ దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దాదాపు 40 ఎకరాల భూమిని గీతం యూనివర్శిటీ ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ శాఖ ప్రాథమిక విచారణలో తేలింది. యూనివర్శిటీ ప్రధాన ద్వారాన్ని కూడా అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగానే కూల్చివేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గీతం యూనివర్శిటీ ఆ భూములను ఆక్రమించినట్లు గుర్తించారు.
ఇక జగన్ అధికారంలోకి వచ్చినవెంటనే చంద్రబాబు హయాంలో కరకట్టపై అక్రమంగా నిర్మించారంటూ ప్రజావేదిక భవనాన్ని కూల్చివేశారు. పర్యావరణ, నదుల చట్టాలతో పాటు అన్ని రకాల నియమ నిబంధనలకు విరుద్దంగా నిర్మించినట్టుగా ఆరోపిస్తూ ప్రజావేదికను కూల్చివేశారు.