జగన్ కు అంత సీన్ లేదు: నారా లోకేష్, పవన్ కల్యాణ్ కు కౌంటర్
ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తిప్పికొట్టారు.
హైదరాబాద్: ఉద్ధానం కిడ్నీ బాధితుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన విమర్శలను ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తిప్పికొట్టారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఏమీ చేయలేదని పవన్ కల్యాణ్ అంటున్నారు. తాము ఎంతో చేశాం, ఇంకా చేస్తామని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. జగన్ కు అంత సీన్ లేదని, తమకు పోటీయే కాదని ఆయన అన్నారు. వైసిపి ఐసియూలో ఉందని, బిజెపి ఆక్సిజన్ అందిస్తోందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడిపికి బిజెపియే పోటీ అని ఆయన అన్నారు.
వైసిపికి ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని అన్నారు. కేసుల మాఫీ కోసం వైసిపి ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం 17 వేల కిలీమీటర్ల సీసీ రోడ్లు వేసిందని, తాము వేసిన రోడ్లపైనే ప్రతిపక్షాలు నడుస్తున్నాయని అన్నారు. వచ్చే ఆరు నెలల్లో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రతి ఇంటికీ కుళాయి ఇస్తామని అన్నారు. రూ. 162 కోట్లతో పంచాయతీ భవనాలు నిర్మించినట్లు తెలిపారు.
ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఎపి నెంబర్ వన్ గా నిలిచిందని, ఉపాధి హామీ పథకానికి నిధులు ఆపేయాలని లేఖలు రాశారని ఆయన అన్నారు. పెద్ద యెత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు.
వెంకన్నస్వామిని కూడా రాజకీయాల్లోకి లాగారని, దాన్ని తిప్పికొట్టాలని, వెంకన్న సామిని రాజకీయాల్లోకి తెచ్చినవాళ్లు బాగుపడేది లేదని అన్నారు.