నంద్యాల విజయంపై అమాత్యులు ఎమన్నారంటే..
- నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అఖండ విజయం.
నంద్యాల ఉప ఎన్నికలో భూమా బ్రహ్మానంద రెడ్డి విజయం తో టీడీపీలో సంబరాలు జరుపుకున్నారు. అదే సందర్భంలో మంత్రులు కూడా విజయాన్ని అద్బుతం అంటూనే జగన్ పై రెచ్చిపోయి విమర్శలు చేశారు, వారు ఎమన్నారో చూడండి...
భూమా అఖిల ప్రియ
నంద్యాల ఉప ఎన్నికల్లో తమకు డిపాజిట్ కూడా రాదని నాడు ప్రచారం చేసిన నేతలకు ఈ ఫలితం చెంపపెట్టులాంటిదని మంత్రి అఖిలప్రియ అన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ది పథకాలే విజయానికి కారణమన్నారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయమని, నంద్యాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రాయలసీమ అభివృద్ధికి కృషి చేసిన తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. భూమా కుటుంబం, టీడీపీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతోనే నంద్యాల ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని అన్నారు.
గంటా శ్రీనివాసరావు
జగన్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను చూసి ప్రజలు భయపడ్డారని మంత్రి గంటా అన్నారు. జగన్ 14 రోజులు నంద్యాల నియోజకవర్గంలో ప్రచారం చేసి... ప్రజలను మభ్య పెట్టాలని చూశారని దుయ్యబట్టారు. అయితే జగన్ మాటలను అక్కడి ప్రజలు విశ్వసించలేదన్నారు. 2019లో వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతుందని ఎద్దేవాచేశారు. జగన్ మానసిక పరిస్థితిని ప్రజలు అర్ధం చేసుకున్నారని, అందుకే నంద్యాలలో భారీ మెజార్టీని ఇచ్చారని గంటా చెప్పారు. నంద్యాల ఫలితాలే కాకినాడలో కూడా రిపీట్ అవుతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.
సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి
గత మూడు సంవత్సరాల చంద్రబాబు పరిపాలకు నంద్యాల ఎన్నికలు రెఫరెండం అని మంత్రి సోమిరెడ్డి అన్నారు. అలాగే 2019లో చంద్రబాబు ప్రభుత్వం తిరిగి రావాలని నంద్యాల ప్రజలు సందేశమిచ్చారన్నారు. నంద్యాలలో టీడీపీకి ఓటేసిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. 13ఏళ్ల నుంచి నంద్యాలలో పాతుకుపోయిన నేతను భూమా కుటుంబసభ్యులు ఓడిపోయేలా చేశారని అన్నారు. జగన్ బృందానికి నంద్యాల ప్రజలు గుణపాఠం చెప్పారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే రోజాను ప్రచారానికి పంపాలని మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అచ్చెన్నాయుడు
న్యాయానికి, ధర్మానికి పనిచేసిన ప్రభుత్వానికి నంద్యాల ప్రజలు పట్టంకట్టారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నంద్యాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తిని, వైసీపీ పార్టీని తానెప్పుడు పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. తండ్రి పేరు... డబ్బుతో నాలుగు సంవత్సరాలుగా పార్టీని నడిపారే తప్ప, ప్రజల అభిమానంతో పార్టీ నడవలేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
నారాయణ
నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి భారీ విజయాన్ని అందించినందుకు ప్రజలకు మంత్రి నారాయణ ధన్యవాధాలు తెలిపారు. విజయానికి కారణం ప్రభుత్వం, చంద్రబాబు చేపట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలే అన్నారు.
ఆదినారయణ రెడ్డి
నంద్యాల నియోజకవర్గాన్నే కాకుండా, రాష్ట్రం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే అభివృద్ధి చేయగలరనే నమ్మకంతోనే ఓటర్లు నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీకి పట్టం కట్టారని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. అన్ని రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసినప్పటికీ వైసీపీ అధినేత జగన్ ను నంద్యాల ప్రజలు నమ్మలేదని చెప్పారు. ఈ ఎన్నికతో వైసీపీ పతనం ప్రారంభమైందని... రానున్న రోజుల్లో వైసీపీ దుకాణాన్ని జగన్ మూసుకోవాల్సిందేనని అన్నారు.
ప్రతిపాటి పుల్లారావు
జగన్ ప్రచారంలో ధర్మానికి, న్యాయానికి ఓటు వేయమని ప్రజలకు చెప్పారని, ప్రజలు నిజంగానే అదే పనిచేసి ధర్మంవైపు నిలబడే తమ పార్టీకి ఓటు వేశారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాయలసీమలో రెచ్చిపోయి మాట్లాడితే ఓట్లొస్తాయని జగన్కి పీకే సలహా ఇచ్చాడని, అది రివర్సైపోయి జగన్ తాను తీసుకున్న గోతిలోనే పడ్డాడని అన్నారు. నిరంతరం అభివృద్ధిని అడ్డుకునే వైసీపీ తీరుకి వ్యతిరేకంగా నంద్యాల ప్రజలు జగన్కి ఓటమిని కట్టుబెట్టి బుద్ధి చెప్పారని అన్నారు.
నారా లోకేష్
టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఫలితం నంద్యాల ఉపఎన్నిక ఫలితం అని నారా లోకేష్ ట్విట్టర్ ధీమా వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడు ప్రజల నేత. అభివృద్ధిపై తమ నమ్మకాన్ని కనబర్చిన నంద్యాల ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, వైసీపీ క్రిమినల్ పాలిటిక్స్ కు నంద్యాల ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్తకు నా ధన్యవాదాలు అని లోకేశ్ పేర్కొన్నారు.
పరిటాల సునీత
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ది పనులు ప్రజలకు చేరాయి, అందుకు నిదర్శనం నంద్యాల ఉప ఎన్నిక అని మంత్రి పరిటాల సునిత పెర్కోన్నారు. రాష్ట్ర అభివృద్ది ఒక్క టీడీపీతోనే అవుతుందని ఆమె తెలిపారు.
మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి