టిడిపిలో చేరిన కిషోర్
- నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరారు.
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరారు. గురువారం రాత్రి విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్లో తన కొడుకు, మద్దతుదారులతో కలిసి చంద్రబాబునాయుడు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. సమైక్య రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడే కిషోర్. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ కుటుంబాల్లో నల్లారి కుటుబం కూడా ఒకటి. తన కొడుకు అమరనాధరెడ్డితో పాటు సుమారు 40 మంది సర్పంచులు, ఎంపిటిసిలతో కిషోర్ టిడిపి కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో నల్లారి కుటుంబం కూడా ఒకటన్నారు. సమైక్య రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసిన వ్యక్తన్నారు. నల్లారి కుటుంబమంటే తనకు చాలా గౌరవమని చెప్పారు. విభజన సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి లాగ డ్రామాలాడకుండా కిరణ్ అధిష్టానాన్ని వ్యతిరేకించి పార్టీలో నుండి బయటకు వచ్చినట్లు చెప్పారు. మొత్తం మీద మాజీ సిఎం కిరణ్ ను చంద్రబాబు ఆకాశానికెత్తేశారు.