కార్యకర్తలకు నాయుడు 'టార్గెట్ 80' మంత్రోపదేశం
ప్రతి పల్లె, పట్టణాన, నగరాన, నియోజకవర్గంలో 80 శాతం మంది టిడిపి వైపు ఉండేలా కార్యకర్తలు పని చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకర్తలకు ’టార్గెట్ 80 శాతం’ మంత్రోపదేశం చేశారు.తెలుగుదేశం హాయంలో 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉండాలని, ఈ దిశలో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఆయన శ్రీకాకుళంలో చెప్పారు.
పవన్ కల్యాణ్ కొత్త గా లేవదీసిన రాయలసీమ, ఉత్తరాంధ్ర నిర్లక్ష్య వాదనను పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఏప్రాంతానికి అన్యాయం జరగనీయనని హామీ ఇచ్చారు.
నిన్న మొన్న అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్ కల్యాణ్, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, అదిలాగే కొనసాగితే, ఈ ప్రాంతాలలో వేర్పాటు ఉద్యమాలు వస్తాయని పవన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ముఖ్యమంత్రి ఈ హెచ్చరికకు క్లుప్తంగా స్పదించడం విశేషం.
నిర్దిష్టమైన ఆలోచనలతో పరిపాలన ద్వారా నూటికి 80శాతం ప్రజలు ఆనందంగా ఉండాలనేది తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చెప్పారు. తన అకాంక్ష పార్టీ అందరి ఆకాంక్షగా తీసుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని అంటూ ఏ గ్రామంలో, పట్టణంలో , నియోజవర్గంలో... ఎటూ చూసినా 80శాతం ప్రజలు తెలుగుదేశం వైపే ఉండేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.
శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్లు, రైల్వే, ఓడ రేవులు, విమానాశ్రయాలను అభివృద్ధి చేసి ప్రజలకు మౌలికవసతులు కల్పిస్తున్నపుడు ప్రజలు ’మన వైపే ’ తప్పక వస్తారని ఆయన కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు.
ఎటుచూసినా తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకం కనిపిస్తూ ఉందని, అందుకే ఏ రాష్ట్రానికి రాని పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించడమే తన ధ్యేయం, తద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతిఒక్కరి ఆదాయాన్ని పెంచే కార్యక్రమాల్ని చేపట్టనున్నట్లు చెప్పారు. 2022 నాటికి మూడు దేశంలో మూడు అగ్రరాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా నిలుపుతానన్నారు. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో రాష్ట్రాన్ని నిలిపేవిధంగా కృషిచేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపే చూసేలా తెలుగువారి సత్తా చాటుతామన్నారు.