కాపు ఉద్యమ సమయంలో రైలును తగలబెట్టించింది వైసీపీనే అని తేలిపోయింది. బుధవారం జరిగిన టిడిపి సమన్వయ కమిటి సమావేశంలో చంద్రబాబునాయుడు తేల్చేసారు.

కాపు ఉద్యమ సమయంలో రైలును తగలబెట్టించింది వైసీపీనే అని తేలిపోయింది. బుధవారం జరిగిన టిడిపి సమన్వయ కమిటి సమావేశంలో చంద్రబాబునాయుడు తేల్చేసారు. చంద్రబాబు అధ్యక్షతన ఏపి, టిటిడిపి నేతలు, మంత్రులు సమావేశమయ్యారు లేండి. ఆ సమావేశంలో సిఎం మాట్లాడుతూ, ఉద్యమ సమయంలో తునిలో రైలు తగలబెట్టింది వైసీపీనే అని చెప్పారు. ఇదే ఘటనపై విచారణ జరిపిన సిఐడి ఆ మేరకు రిపోర్టు ఇచ్చిందో ఏమో తెలీదు. చంద్రబాబు మాత్రం నిర్ధారించేసారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మరి రైలును తగటబెట్టింది వైసీపీనే అని తేలిపోయినా బాధ్యులను ఇంకా అరెస్టు చేయలేదు? రైలు దహనం కేసులో కొన్ని వందల మందిని పోలీసులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నారు. కొందరిని అరెస్టులు కూడా చేసి తర్వాత విడిచిపెట్టారు. అందులో భాగంగానే వైసీపీ నేత కరుణాకర్ రెడ్డిని కూడా సిఐడి పలుమార్లు విచారించింది. మరి ఎందుకు అరెస్టు చేయలేదో? ఇంకో నాలుగు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలుపెడుతుండగా చంద్రబాబు ఈ విషయం ఎందుకు చెప్పారబ్బా?

అంతేకాదు చంద్రబాబు మరో విషయం కూడా చెప్పారు. రాజధాని ప్రాంతంలో ఆమధ్య రైతుల పంటలు తగలబడ్డాయి గుర్తుందా? అది కూడా వైసీపీ పనేనట. రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తలు పెంచటానికి వైసీపీనే పంటలు తగలబెట్టించిందని చంద్రబాబు చెప్పారు. మరి, ఈ విషయాన్ని విచారించిన పోలీసులు ఎక్కడా పంటలు తగలబెట్టింది వైసీపీ నేతలే అని చెప్పినట్లు లేదు.

సరే అసలు ఘటనలు జరిగినపుడే చంద్రబాబు, మంత్రులు మాట్లాడుతూ, రైలును, పంటలను తగలబెబ్టించింది జగన్మోహన్ రెడ్డే చేయించారని, రాయలసీమ గుండాలే చేసారని, వైసీపీ నేతల హస్తముందని రకరకాల ప్రకటనలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది.

ఇవే కాదు సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీపైన తన అక్కసంతా వెళ్ళగక్కారు. ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కట్టబెడితే రాష్ట్రాభివృద్ధికి కుట్రలు చేస్తోందట. వైసీపీ ప్రజాస్వామ్యాన్నిదుర్వినియోగం చేసిన పార్టీ చరిత్రలోనే లేదట. చివరకు సదావర్తి భూములను వేలం వేసి ప్రభుత్వానికి ఆదాయం తెద్దామని ప్రయత్నిస్తే దాన్ని కూడా అడ్డుకుందట.

ఉపాధిహామీ నిధులు రాకుండా చేసి కూలీల పొట్టగొట్టిందట వైసీపీ. ఉపాధిహామీ పథకం అమలులో అక్రమాలు జరిగినట్లు స్వయంగా కాగ్ నిర్ధారించిన సంగతి చంద్రబాబు మరచిపోయారేమో? ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రంలో జరిగిన, జరగబోయే ప్రతీ అనార్ధానికి వైసీపీనే కారణమని తేల్చేసారు.