సంచలన  కేసులో తుది తీర్పు వెలువరనున్న కోర్టు


విజయవాడ:  విజయవాడలో ఆస్తి తగాదాల నేపథ్యంలో  చిన్నారి నాగ వైష్ణవిని బంధువులు బాయిలర్‌లో వేసి చంపేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు ఇవాళ తీర్పు వెలువరిచే అవకాశం ఉంది. ఎనిమిదేళ్ళ క్రితం విజయవాడలో చోటు చేసుకొన్న ఈ ఘటన అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.


2010 జనవరి 30వ తేదిన నాగ వైష్ణవి దారుణంగా హత్యకు గురైంది.  ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు  జూన్ 14వ తేదిన తుది తీర్పును వెలువరచనుంది. ఈ తీర్పు వెలువడనున్న నేపథ్యంలో  కోర్టు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. విజయవాడకు చెందిన బీసీ నేత పలగాని ప్రభాకర్ కుమార్తె నాగ వైష్ణవిని బంధువులే దారుణంగా హతమార్చారు. 

ప్రభాకర్‌పై కోపంతో ఆయన కుమార్తె వైష్ణవి స్కూల్‌కు వెళ్తుండగా నిందితులు బలవంతంగా గుంటూరు తీసుకువెళ్లి ఇనుము కరగబెట్టే నిప్పుల కొలిమిలో ఆమెను పడేసి కాల్చేశారు. నాగవైష్ణవి హ్యతకు గురైన విషయం తెలిసిన వెంటనే  ప్రభాకర్‌ కూడ మృతి చెందాడు.ఈ కేసులో ఏ1 నిందితుడిగా మెర్ల శ్రీనివాసరావు, ఏ2గా వెంపరాల జగదీష్, ఏ3గా పంది వెంకట్రావు అలియాస్‌ కృష్ణ ఏడేళ్లుగా జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. నిందితులకు బెయిల్‌ మంజూరు చేయకుండానే కేసు విచారణ పూర్తి చేశారు. ప్రభాకర్‌ మొదటి భార్య వెంకటేశ్వర్వమ్మ తమ్ముడు పంది వెంకట్రావు ఈ కేసులో ఏ3గా ఉన్నారు.