బ్రేకింగ్ న్యూస్: రాజీనామాలు, నిరాహారదీక్షలకు ముహూర్తం ఫిక్స్
వైసిపి ఎంపిల రాజీనామాలకు, నిరాహార దీక్షలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగించేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం. దాంతో ప్రత్యేకహోదాపై చర్చ, అవిశ్వాసతీర్మానం నోటీసులపై చర్యలు లాంటివి లేకుండానే సమావేశాలు ముగిసే అవకాశాలున్నాయి. దాంతో శుక్రవారం సమావేశాలు వాయిదా పడగానే వైసిపి ఎంపిలు నేరుగా ఏపి భవన్ కు వెళ్ళి నిరాహారదీక్షకు కూర్చోబోతున్నారు.
మార్చి 5వ తేదీన బడ్జెట్ రెండో విడత సమావేశాలు మొదలైన దగ్గర నుండి పార్లమెంటు సమావేశాలు ఒక్క రోజుకూడా సాగలేదు. లోక్ సభలో వైసిపి, టిడిపిలు ఇస్తున్న అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ పరిగణలోకి తీసుకోకుండానే సభను వాయిదా వేసేస్తున్నారు. దాంతో వైసిపి ఇప్పటి వరకూ 11 సార్లు నోటీసులిచ్చినా ఉపయోగం లేకుండా పోయింది.
ఇక, శుక్రవారం నుండి రాష్ట్ర రాజకీయాలు ఏపి భవన్ కు కేంద్రంగా మారబోతోంది. మరి ప్రతిపక్ష ఎంపిల నిరాహార దీక్షలకు చంద్రబాబు అనుమతిస్తారా లేదా? అన్నది ఆసక్తిగా మారింది. నిరాహార దీక్షలకు అనుమతిస్తే టిడిపి ఎంపిలు దీక్షలు ఎందుకు చేయటం లేదనే ప్రశ్న వస్తుంది. ఒకవేళ అనుమతించకపోతే రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసిపి ఎంపిలు దీక్షలు చేస్తుంటే అడ్డుకుంటారా అంటూ చంద్రబాబుపై మండిపడతారు జనాలు. దాంతో ఏ విధంగా చూసినా చంద్రబాబుకు వైసిపి దీక్షలు ఇబ్బందే.