చంద్రబాబు నాయుడు , రాజశేఖర్రెడ్డి,  జగన్, షర్మిల,సిపిఐ, సిపిఎం నాయకులు  పాదయాత్రలు  చేస్తున్నపుడు అనుమతి  తీసుకున్నారా? కాపులు పాదయాత్ర అనేసరికి 144, 30 సెక్షన్లు విధిస్తారా- ముద్రగడ

కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంతో తలపడేందుకే నిర్ణయించుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రమంతా అకస్మాత్తుగా పాదయాత్రల మీద విధించిన ఆంక్షలను ఖాతరు చేసేది లేదని గతంలో ప్రకటించినట్లుగా యాత్రా పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. రావులపాలెంలో ఈ నెల 16వ తేదీ ఉదయం 9 గంటలకు సత్యాగ్రహ పాదయాత్ర ఆయన ఇది వరకే ప్రకటించారు. అదివారం నాడు తన నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తూ ఈ ప్రాంతంలో పోలీసులను పెద్ద ఎత్తున దింపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కేవలం కాపు ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆంక్షలు విధిస్తున్నారని ఆయన అనుమానించారు. 2019 వరకు 114,30 సెక్షన్లు అమలులో ఉంచి ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప మరొకరు రోడ్డెక్కకుండా చేస్తున్నారని అంటూ పంతం మాని పాదయాత్రకు సహకరించండని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

పాదయాత్రల మీద ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా విమర్శించారు. గతంలో ఎంతోమంది నాయకులు పాదయాత్రలు చేశారని, వాటికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవడం, అనుమతినీయడం ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు , రాజశేఖర్రెడ్డి, జగన్, షర్మిల,సిపిఐ, సిపిఎం నాయకులు ఎందరు పాదయాత్రలు చేయలేదూ.. అని అయన అడిగారు.

’నవంబర్ 16వ తేదీన రావులపాలెం నుంచి అంతర్వేది వరకు నా పాదయాత్ర కొనసాగుతుంది. మేమంతా దొంగలమంటున్నారు. అంతర్జాతీయ తీవ్రవాదులంటున్నారు. అయితే, బేడీలు వేసి పోలీసు పాస్‌ ఒకటి మా మెడలో తగిలించేస్తే ఏ బాధా ఉండదు’ అని ముద్రగడ డీజీపీని కి సలహా ఇచ్చారు.

’చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రావణాసుర పాలన సాగిస్తున్నారు. కాపు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారు. రిజర్వేషన్ల కావాలని కాపు జాతి మిమ్మల్ని దేహీ అని అడిగిందా. మీరే అన్ని హామీ లు ఇచ్చారు. వాటి సంగతేమయిందని అడిగితే,పోలీసులను ఉసికొల్పుతున్నారు,ఇదేమిటి ,’ అని ఆయన ప్రశ్నించారు.